గుంటూరు జిల్లాలో అధికారం
ప్రజా ప్రతినిధుల మధ్య ఇసుక పంచాయితీ మొదలైంది. ఎంపి-ఎంఎల్ఏ మధ్య అక్రమ ఇసుక
పంచాయితి తీవ్రస్ధాయిలో ఉందంటే మధ్యలో పోలీసులు నలిగిపోయేంతగా. ఇద్దరిలో ఒకరు
ప్రతిపక్షానికి చెందిన వారయ్యుంటే పరిస్ధతి వేరేగా ఉండేది. కానీ ఇద్దరు కూడా అధికారపార్టీకి
చెందిన వారే కావటంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
విషయం ఏమిటంటే, గుంటూరు జిల్లాలోని ఉద్ధండరాయుని పాలెం మండలంలో ఇసుక అక్రమ రవాణా భారీ ఎత్తున జరుగుతోంది. ఈ అక్రమ రవాణా వెనుక జిల్లాలోని బాపట్ల ఎంపి నందిగం సురేష్ మద్దతుదారుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి. అదే సమయంలో అక్రమరవాణాను అడ్డుకోవాలని ఎంఎల్ఏ పట్టుబట్టారట.
అంటే అధికార పార్టీలోని ఎంపి-ఎంఎల్ఏల మధ్య ఇసుక అక్రమ రవాణా అన్నది ఆధిపత్య పోరాటంగా మారిపోయింది. అక్రమరవాణాపై ఎంఎల్ఏ ఫిర్యాదు చేయగానే మండల అధికారులు, గనులు భూగర్భ శాఖ ఉన్నతాధికారులు దాడులు జరిపి ట్రాక్టర్లు, పొక్లైనర్లను సీజ్ చేశారు.
ఎప్పుడైతే వాహనాలు సీజ్ అయ్యాయో వెంటనే ఎంపి రంగంలోకి దిగారు. సీజ్ చేసిన వాహనాలను వెంటనే విడుదల చేయాలని ఎంపి ఒత్తిడి పెడుతున్నారు. సీజ్ చేసిన వాహనాలను ఎట్టి పరిస్ధితుల్లోను విడుదల చేయకూడదని ఎంఎల్ఏ మరోవైపు ఒత్తిడి తెస్తున్నారు. దాంతో ఏమి చేయాలో అర్ధంకాక పోలీసులు అవస్తలు పడుతున్నారు. జరుగుతున్నది చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఇసుక అక్రమరవాణా ఆగలేదని అర్ధమైపోతోంది.