ఫిరాయింపులపై ఎటువంటి
చర్యలు తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డిపై బిజెపి నేతల నుండి ఒత్తిళ్ళు వస్తున్నట్లు
సమాచారం. టిడిపి నుండి ఎంఎల్ఏల
ఫిరాయింపులను ఆశిస్తున్న బిజెపి ఫిరాయింపుల అస్త్రం విషయంలో ఆందోళనతో ఉంది. అదే
సమయంలో టిడిపి ఎంఎల్ఏలు కూడా బిజెపిలోకి ఫిరాయిస్తే తమపై ఎక్కడ అనర్హత వేటు
పడుతుందో అన్న భయంతోనే వెనకాడుతున్నట్లు సమాచారం.
ఇంతకీ విషయం ఏమిటంటే మొన్నటి ఎన్నికల్లో టిడిపికి ఘోర పరాజయం ఎదురైన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకం లేకపోవటంతో గెలిచిన 23 మంది ఎంఎల్ఏల్లో అత్యధికులు టిడిపి నుండి బయటకు వచ్చేయాలని చూస్తున్నారు. అయితే అటువంటి వాళ్ళ మొదటి ఛాయిస్ వైసిపినే. కానీ వాళ్ళని చేర్చుకునేందుకు జగన్ సిద్ధంగా లేరు. అందుకనే వాళ్ళంతా బిజెపి వైపు చూస్తున్నారు.
ఇక్కడే సమస్య ఎదురవుతోంది. టిడిపి తరపున గెలిచిన వాళ్ళు ఇతర పార్టీల్లోకి దూకితే వెంటనే వాళ్ళపై అనర్హత వేటు వేయమని స్వయంగా జగనే స్పీకర్ కు చెప్పేశారు. దాంతో ఎంఎల్ఏల్లో కలవరం మొదలైంది. ఒకవేళ బిజెపిలోకి వెళితే వాళ్ళపై అనర్హత వేటు పడటం ఖాయం. దాంతో ఉప ఎన్నికలు తప్పవు. ఉపఎన్నికలంటూ జరిగితే టిడిపి, బిజెపిలు పోటీ చేసినా గెలుపుపై నమ్మకం లేదు.
అందుకనే తాము బిజెపిలోకి ఫిరాయించినా తమపై అనర్హత వేటు పడకుండా చూడాలంటూ కొందరు టిడిపి ఎంఎల్ఏలు బిజెపి నేతలను కోరినట్లు సమాచారం. అందుకనే బిజెపి నేతలు ఫిరాయింపుల విషయాలను చూసి చూడనట్లు వెళ్ళాలంటూ కోరినపుడు జగన్ అంగీకరించలేదట. దాంతో అగ్రనేతలతో జగన్ పై ఒత్తిడి తెస్తున్నట్లు వైసిపి వర్గాలు చెప్పాయి. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.