హైదరాబాద్ హయత్నగర్లో యువతి అపహరణ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ గుర్తు తెలియని వ్యక్తి బుధవారం ఓ యువతితో పరారయ్యాడు. విచారనలో.. బేంగుళూరు రహదారిపై టీ దుకాణదారుడు వద్దకు వచ్చిన ఓ వ్యక్తి తన పేరు శ్రీధర్ రెడ్డి అంటూ పరిచయం చేసుకున్నాడని పోలీసులు అన్నారు.
తన తల్లి వైద్యురాలని, తండ్రి న్యాయమూర్తి, సోదరుడు పోలీస్ కమిషనర్ అని చెప్పాడని వచారనలో తెలిసింది. సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ దుకాణ యజమానిని నమ్మించాడు. 21 ఏళ్ల తన కుమార్తెకు ఉద్యోగం కావాలని టీ దుకాణం నిర్వాహకుడు కోరాడు. దీంతో ఆ యువకుడు తన కారులో తండ్రీ కుమార్తెను నెక్లెస్ రోడ్డు, సచివాలయం పరిసర ప్రాంతాల్లో తిప్పాడు. తిరిగి వెళ్లే క్రమంలో ధ్రువీకరణ పత్రాల నకలు తేవాలని యువతి తండ్రికి చెప్పాడు.
దీంతో అతడు కారు దిగగానే యువతితో పాటు ఆగంతకుడు కారులో పరారయ్యాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువతిని విజయవాడ వైపు తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. కారు నంబర్ ఆధారంగా విజయవాడలో పోలీసులు గాలిస్తున్నారని చెప్పారు.