2019 ఏపీ లో జరిగిన ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయాన్ని చవి చూసిన సంగతీ తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రెండు చోట్ల ఓడి పోవటంతో ఆ పార్టీ పరిస్థితి పనైపోయిందని చాలా మంది వ్యాఖ్యానించారు. అయితే జనసేన ఓటమి గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నాకు ఓటమి కొత్త కాదు. ఈ ఓటమి నన్ను వెనక్కి నెట్టలేదని చెప్పుకొచ్చారు. సినిమాలో ఎన్నో కోట్లా ఆదాయాన్ని వదులుకొని వచ్చానని, ఎన్నో ప్రశంసలు, కోట్ల మంది చప్పట్లు వదులుకొని కష్టాల రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.
అయితే ఎన్నికల ముందు టీడీపీతో జనసేన రహస్య పొత్తు పెట్టుకుందని వైసీపీ ప్రధానంగా ఆరోపించింది. ఎన్నికల్లో కూడా ఇదే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. జనసేన కూడా వైసీపీ ఆరోపణలు తిప్పికొట్టలేకపోయింది. దీనితో జనసేనకు ఓటమికి ఇది కూడా ఒక కారణమని ఇంకొక సెక్షన్ ఆరోపించే విషయం. అయితే ఈ పవన్ పొత్తుల గురించి మాట్లాడుతూ మాకు ఎవరితోను పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.
రాజకీయాలు మారాలని బలమైన సంకల్పంతో వచ్చామని చీకటి ఒప్పందాలు, చీకటి రాజకీయాలు తనకు తెలియదని చెప్పారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనీ నిర్ణయించుకున్నాము. ఎంత కష్టమైనా ఇదే మాటకు కట్టుబడి ఎన్నికలకు వెళ్ళాము. ఇంకా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి వంద రోజులు టైమిస్తాము. తరువాత వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని, ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీస్తామని జనసేనాని చెప్పుకొచ్చారు. జనసేన సైనికుల మీద దాడులు చేస్తే సహించమని హెచ్చరించారు. ఏమైనా జరిగితే నేనే రోడ్ మీదకు వస్తానని వెల్లడించారు. జనసైనికులు ధైర్యంగా ఉండండి, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని పవన్ చెప్పారు. పశ్చిమ గోదావరిలో జనసేన కార్యకర్త మురళి చనిపోవటం తనను బాధపెట్టిందని చెప్పారు.