టిడిపి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో  తెలుసుకోవటానికి ఏదైనా ఒక్క జిల్లా పాలిటిక్స్ ను పరిశీలిస్తే  చాలు. విశాల తీరమున్న విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టి పరిస్థితి మునిగిపోయే నావలా తయారైంది. ప్రజా ప్రతినిధులు ఎవరి దారిలో వారు నడుస్తూ, పార్టీని దారిలో పెట్టేవారే లేనట్లు కనిపిస్తుంది. అంతర్గత మనస్పర్ధలతో నేతలు రచ్చకెక్కుతున్నారు. విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేల చూపులు చూస్తుంది. 2004 ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లాలో పదకొండు అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. ఈ సారి ఎన్నికల్లో కేవలం నలుగురితో సరిపెట్టుకుంది. అందులో విశాఖ ఉత్తర నియోజక వర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు గెలుపు అంత ఈజీ కాలేదు. చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు చివరి నిమిషాల్లో ఒడ్డునపడ్డారు.





ఎన్నికల్లో గెలవకపోయినా పార్టీలో గెలిచిన నలుగురు చేయీ చేయీ కలిపి ముందుకెళుతున్నారు అంటే అదీ లేదు. నలుగురూ నాలుగు దారుల్లో వెళుతూ పార్టీని ఏ తీరానికి చేర్చాలో తెలియని స్థితిలో ఉన్నారు. ఎన్నికల ఫలితాల షాక్ నుంచి పూర్తిస్థాయిలో తేరుకోలేకపోతున్న టిడిపి అధినేత చంద్రబాబు ఈ నేపధ్యంలో ఆయన పూనుకొని లోకల్ సమస్యల పై దృష్టి పెట్టే పరిస్థితి లేదు. దీంతో ఎక్కడికక్కడ లోకల్ అధికార కేంద్రాలుగా మారేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. విశాఖ లో టిడిపి అధ్యక్షుడిగా ఎస్ ఎ రెహ్మాన్ ని నియమించారు. అయితే రెహ్మాన్ విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం ఉంది. అందుకే రెహ్మాన్ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం తాను పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టనని భీష్మించుకుని కూర్చున్నారు వాసుపల్లి గణేష్. అంతేకాదు రెహ్మాన్ ని  బాగానే విమర్శిస్తున్నారు కూడా. ఈ నేపధ్యంలో వాసుపల్లి గణేష్ కు షోకాజ్ నోటీసులు ఇస్తానని కూడా రెహ్మాన్ ప్రకటించారు. ఇటు వాసుపల్లి ధోరణి మాత్రం ఏం చేసుకున్నా పరవాలేదు.







టిడిపి కార్యాలయం వైపు కన్నెత్తి చూసేది లేదనేలా ఉంది. ఇటీవల అధికార పార్టీని విమర్శించడానికి వాసుపల్లి గణేష్ పార్టీ కార్యాలయంలో కాకుండా ఒక హోటల్లో ప్రెస్ మీట్ పెట్టడమే ఇందుకు నిదర్శనం. టిడిపి కార్యాలయంలోకి అడుగు పెట్టకుండా సొంత ఖర్చుతో ప్రెస్ మీట్ పెట్టడం పార్టీలో చర్చ నీయాంశంగా మారింది. పార్టీ కార్యాలయం ఉండగా ప్రెస్ మీట్ బయట ఎక్కడో పెట్టడం ఏంటని రెహ్మాన్ రగిలిపోతున్నారు. వాసుపల్లి గణేష్ అధికార పార్టీ కంటే తననే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారంటూ సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారు. ఇక విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో అంటీముట్టనట్టుగా మెలుగుతున్నారట. అధ్యక్షుడు ఆదేశించినా ఆచరించటానికి మొగ్గు చూపడం లేదు. ఇక గంటా శ్రీనివాసరావు ఐతే పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలను పెద్దగా లెక్కలోకి తీసుకోవడం లేదట. గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవులు అనుభవించి అధికారం చెలాయించడాన్ని బాగా వంటబట్టించుకున్న గంటా ఇప్పుడు ఆ అధికారానికి దూరంగా జస్ట్ ఎమ్మెల్యేగా కొనసాగడాన్ని ఏమాత్రం జీర్ణించుకోవడం లేదని సొంత పార్టీ నాయకులే చెప్పుకొంటున్నారు. ఎవరి దారి వారిదే అన్నట్లు సాగుతున్న విశాఖ జిల్లా టీడీపీ నేతలు కార్యకర్తలకు ఏం చేస్తారు, పార్టీని ఏ తీరానికి చేరుస్తాననేది నాయకులకే అర్థం కాని విషయంగా మారిందని సమాచారం 


మరింత సమాచారం తెలుసుకోండి: