ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి యూపీఏ పాలనలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తీవ్ర స్థాయిలో ఉద్యమం కొనసాగుతుంది. ఆ సమయంలో ఒక్క కాంగ్రెస్ తప్ప అన్ని పార్టీల వారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ముక్త కంఠంతో పోరాటం కొనసాగించారు. ఎంతో మంది మంది విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు సైతం తెలంగాణ కో తమ ప్రాణాలు తృణ ప్రాయంగా అర్పించారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు సకల జనులు సమ్మోతో తెలంగాణ ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో తీసుకు వచ్చారు.
చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరి నోట ఒకటే మాట తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి. ఇలాంటి సమయంలో కేంద్రం నుంచి ఓ చిన్నమ్మ వచ్చింది. తెలంగాణ ప్రజలు తమ సొంత బిడ్డల్లా..అన్నాదమ్ముల్లా..అక్కా చెల్లేలా భావించిన ఆ మహానుభావురాలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి, ఎంతో మంది త్యాగదనుల త్యాగాలకు ఒక అర్థం ఉండాలని ఇక్కడ నేతలతో చేయి కలిపింది. ఆమె ఎవరో కాదు మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ సుష్మా స్వరాజ్. అయితే తెలంగాణ సాకారానికి యూపీఏ ఎంత కీలకంగా మారిందో అదే సమయంలో బీజేపీ కూడా అంతే కీలకంగా మారింది.
యూపీఏ ప్రభుత్వంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆ సమయంలో సుష్మా స్వరాజ్ పాత్ర ఎంతో ఉంది. 2009 నుంచి 2014 వరకు లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలిగా సుష్మా స్వరాజ్ వ్యవహరించడం.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఆమె వంతు కృషి చేయడం అందరికీ తెలిసిందే. లోక్సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.
ఆ సమయంలో ఆమె మాట మార్చకుండా సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో బిల్లు ఆమోదం పొందింది. అంతే కాదు ఇక్కడ బీజేపీ కీలక నేతలు ఢిల్లీలో జంతర్మంతర్, ఏపీ భవన్, ఇతర చోట్ల జరిగిన ఆందోళనల్లో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో జరిగిన ఉద్యమ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఏది ఏమైనా ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణలో జరిగిన ఉద్యమానికి మనస్పూర్తిగా మద్దతిచ్చారు సుష్మాస్వరాజ్. అందుకే తెలంగాణ ప్రజలకు ఆమె కూడా ఆరాద్య దైవంగా మారారు. ఆమె మృతికి తెలంగాణ ప్రజలు తల్లడిల్లుతున్నారు..ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నారు.