తెలగాణలో నేటి నుంచి పరిపాలన కేంద్రం మారింది. తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేతకు ఇప్పటికే నిర్ణయించిన ప్రభుత్వం.. శాఖలన్నింటినీ వాటికి తాత్కాలికంగా కేటాయించిన భవనాలకు తరలించింది. ఉన్న సెక్రటేరియట్ కూల్చి.. కొత్త భవనాలు కట్టేవరకు అక్కడినుంచే పరిపాలన కార్యక్రమాలు జరగనున్నాయి. ఆయా భవనాల్లో కోట్ల రూపాయల ఖర్చుతో ముస్తాబు చేశారు.రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కేంద్రం తాత్కాలికంగా మారింది. బూర్గుల రామకృష్ణారావు(బీఆర్కే) భవన్కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి కార్యాలయం కూడా షిఫ్ట్ అయింది. శుక్రవారం నుంచే....అక్కడ పరిపాలన సాగనుంది.
ప్రస్తుత సెక్రటేరియటలోని మెజారిటీ ఆఫీసులను భవన్కు బీఆర్కే తరలించడం దాదాపు పూర్తయిపోయింది. దీంతో ఆ భవన్ వద్ద కల్పించాల్సిన భద్రతపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఆ ప్రాంతమంతా పోలీస్ పహారాలోకి వెళ్లనుంది. భవనం పరిసరాలను హైసెక్యూరిటీ జోన్ గా పోలీసులు ప్రకటించనున్నారు. బీఆర్కే భవన్ ముందున్న మూడు రోడ్లను మూసేసి ట్రాఫిక్ను మళ్లించనున్నారు. ఇక తెలుగు తల్లి ప్లైఓవర్ పై కూడా 24 గంటల పాటు షిప్ట్ ల వారీగా పోలీసులు భద్రత ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. బీఆర్కే భవన్, ఫ్లై ఓవర్ రెండు దగ్గరగా ఉండటంతో బందోబస్తు తప్పని సరి అని పోలీసులు భావిస్తున్నారు. ఫ్లైఓవర్ పై ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు వాహనాల రద్దీ అధికంగా ఉంటున్నందున పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోనున్నారు. మరోవైపు ఈ ప్రాంతాన్ని వన్ వే గా చేయాలా అనే ప్రతిపాదన కూడా పోలీసుల పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
వీవీఐపీల రక్షణ, పార్కింగ్ స్థలం ఏర్పాటు తదితర అంశాలను అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇవ్వాలని పోలీసుశాఖను ప్రభుత్వం కోరింది. ఒకటీరెండు రోజుల్లో అధ్యయనాన్ని పూర్తిచేసి రిపోర్టు సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒకసారి సమావేశమైన పోలీసులు మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉంది. పోలీసుశాఖకు సంబధించిన వివిధ టీమ్లు ఇప్పటికే బీఆర్కే భవన్, దాని పరిసర ప్రాంతాలను సందర్శించాయి. అక్కడ తలెత్తే సమస్యలపై దృష్టిసారించాయి. బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు పలు ఆంక్షలను ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది.