తెలుగు రాష్ట్రాల్లో హిమాలయ వాటర్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం వరకూ చంద్రబాబు సమావేశాలు నిర్వహించిన సమయంలో మంత్రులందరికి సాధారణ మినరల్ వాటర్ బాటిల్స్ ఉంచితే ఒక్క చంద్రబాబు లోకేష్లకు మాత్రం ఖరీదైన హిమాలయా వాటర్ బాటిల్స్ను ఉంచేవారు. దీనిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇదో పెద్ద దుబారాగా వైసీపీ విమర్శించింది. అయితే, ఈ విషయంలో చంద్రబాబులో మార్పు వచ్చిందనకునే ఎపిసోడ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హిమాలయ వాటర్పై ఓ సందర్భంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక వైయస్ జగన్ దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని గట్టిగా చెప్పినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే జగన్ దుబారా ఖర్చులను కట్టడి చేసినట్లు వెల్లడించారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని రూ.2 లక్షల ఖర్చుతో ముగించడంలోనే ఇది స్పష్టంగా కనిపించిందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రతి రూపాయి వ్యయానికి అకౌంటబులిటీ ఉంటుందని ట్వీట్ చేశారు. ఇకపై అత్యంత ఖరీదైన హిమాలయా వాటర్ బాటిల్స్ కనిపించవని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.
ఇదిలాఉండగా, ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తీవ్ర నిరాశలో కూరుకుపోయిన చంద్రబాబు ఎట్టకేలకు శుక్రవారం పోలిట్ బ్యూరో భేటీ నిర్వహించారు. ఈ భేటీలో చాలా అంశాలే ప్రస్తావనకు వచ్చినా… ఎన్నికల్లో పార్టీకి దక్కిన ఘోర పరాభవానికి గల కారణాలేమిటన్న విషయంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. టీడీపీ బలహీనతలనే తనకు అనుకూలంగా మలచుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీడీపీని చావుదెబ్బ కొట్టేశారని – తాను మాత్రం ఊహించని విక్టరీ అందుకున్నారని పోలిట్ బ్యూరో దాదాపుగా నిర్ధారించుకుందట. ఈ అంశాన్ని నిర్ధారించేటట్లు....తాజాగా ఈ సమావేశంలో ఎక్కడా హిమాలయ వాటర్ కనిపించుకుండా అందరికీ కిన్లే వాటర్ పెట్టారు. అంతేకాదు....అవి ఫోటోల్లో స్పష్టంగా కనిపించేలా కూడా జాగ్రత్తపడ్డారు.