శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ గ్రేటర్ పరిధి జనాభా దాదాపు కోటి. రానున్న రెండు దశాబ్దాల్లో గ్రేటర్లో జనాభా 2 కోట్లకు పైబడి పెరిగిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో జరిగే అభివృద్ధి విషయంలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కీలక ప్రతిపాదనలు చేసింది. బాహ్యవలయ రహదారి చుట్టూ (ఓఆర్ఆర్) 13 నగరాలను ఏర్పాటు చేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనేది ఈ నివేదిక సారాంశం.
కొన్నేళ్ల కిందటే హెచ్ఎండీఏ రూపొందించిన నివేదిక ప్రకారం, ఔటర్ రింగ్రోడ్డుకు అవతలివైపు దాదాపు 50 వేల ఎకరాల ప్రైవేటు భూమి ఉంది. అయితే, హైదరాబాద్ అభివృద్ధి చెందినంత వేగంగా ఈ భూమి అభివృద్ధి చెందడం లేదు. దీనికి కారణం, ఔటర్కు ఆనుకుని ఉండే సర్వీస్ రోడ్డులోకి రావడానికి వీలుగా గ్రిడ్ రోడ్లు లేకపోవడం. ఈ నేపథ్యంలో ఈ భూమిని వినియోగంలోకి తెచ్చి అవుటర్ చుట్టూ 13 నగరాలు ఏర్పాటు చేస్తే రాజధాని విస్తరిస్తుందని హెచ్ఎండీఏ తేల్చింది. ఈ 13 నగరాల్లో ఒక్కో నగరాన్ని ఒక్కో ప్రత్యేక హబ్గా తయారు చేసి అక్కడ పరిశ్రమల ఏర్పాటుతోపాటు అన్ని సౌకర్యాలతోకూడిన నివాస ప్రాంతాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
అయితే, ఈ ప్రతిపాదనలు అలాగే పెండింగ్లో ఉండిపోయాయి. మొత్తం 121 గ్రామాలలో 2,800 హెక్టార్ల పరిధిలో మౌలిక సదుపాయాలకు 6,732 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయగా ఆ మేరకు ప్రభుత్వం నిర్ణయ0 వెలువడలేదు. దీంతో ఇప్పటికీ...ఆ ఫైలు పెండింగ్లోనే ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం తగు రీతిలో స్పందించకపోతే...అభివృద్ధి అంతా కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం, భవిష్యత్తులో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలతో పాటు జనజీవనానికి ఎంతో ఇబ్బంది తలెత్తడం ఖాయమని పలువురు అంచనా వేస్తున్నారు.