కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ కన్నుమూశారు. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ.. మృతి చెందారు. గత కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు జైట్లీ. శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండటంతో ఈనెల 8న ఎయిమ్స్‌లో చేర్చారు కుటుంబ సభ్యులు. అప్పటి నుంచి ఎయిమ్స్‌ డాక్టర్లు చికిత్స అందించారు.  ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షించారు. గుండె సంబంధిత విభాగంలో నలుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించారు. శ్వాస తీసుకొనేందుకు ఆయన ఇబ్బంది పడుతుండటంతో ఈసీఎంవో కూడా అమర్చారు. ఆయనకు లైఫ్‌ సపోర్ట్‌పై ఉంచారు. ఇవేవి ఆయన్ను బతికించలేకపోయాయి. పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. ఇటీవల అమెరికాకు వెళ్లి దాదాపు నెల రోజులపాటు చికిత్స తీసుకున్నారు జైట్లీ. తిరిగి భారత్‌కు వచ్చిన తర్వాత కూడా చికిత్స కొనసాగించారు. కొత్త ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకొనేందుకు నిరాకరించారు.


అరుణ్ జైట్లీ 1952 నవంబర్ 28న ఢిల్లీలో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. ఇతని తండ్రి మహారాజ్ కిషన్ జైట్లీ.ఆయన ప్రముఖ న్యాయవాది. అరుణ్ జైట్లీ ఢిల్లీ నుంచే డిగ్రీ, లా పట్టా తీసుకున్నారు. ఢిల్లీ యూనివర్శిటీలో విద్యార్థిగా ఉన్నప్పుడే అరుణ్ జైట్లీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు నాయకుడుగా పనిచేశారు. అత్యవసర పరిస్థితి కాలంలో 19 నెలలు జైలుకు వెళ్ళారు. జైలు నుంచి విడుదలయ్యాక జనసంఘ్ పార్టీ చేరారు. 


విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రి హయాంలో అరుణ్ జైట్లీ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. 1991 నుంచి భారతీయ జనతా పార్టీ కార్యవర్గంలో పనిచేశారు. అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. రాజ్యసభలో సభ్యుడుగా కూడా పని చేశారు. పలు రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా వ్యవహరించారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికలలో అమృత్‌సర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి... కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్ చేతిలో ఓడిపోయారు. అరుణ్ జైట్లీని మృతి పట్ల బీజేపీ నేతలతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: