జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా  తండ్రి, కొడుకులు చంద్రబాబునాయుడు, నారా లోకేష్ ప్రతిరోజు ట్విట్టర్లో చెలరేగిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయినదానికి కాని దానికి ట్విట్టర్లో నానా యాగీ చేస్తున్న అబ్బా కొడుకులు  ఇన్ సైడర్ ట్రేడింగ్ మీద మాత్రం ఎందుకు మౌనంగా ఉండిపోయారు ? కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి, నందమూరి బాలకృష్ణ వియ్యంకుడు చంద్రబాబు వల్ల వందల కోట్ల రూపాయలు అనుచితంగా లబ్దిపొందారని మంత్రి బొత్సా సత్యనారాయణ మీడియాలో చెప్పిన విషయం అందరూ చూసిందే.

 

ఇన్ సైడర్ ట్రేడింగ్ లో లబ్దిపొందిన తమ్ముళ్ళు ఇంకా చాలామంది ఉన్నారని బొత్స అంటున్నారు. తొందరలోనే వారి వివరాలను కూడా బయటపెడతామని చెప్పటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిన తమ్ముళ్ళ వివరాలను శాంపుల్ గా సుజనా, బాలకృష్ణ వియ్యంకుడి వివరాలను మాత్రమే ఇస్తున్నట్లు బొత్స చెప్పారు.

 

సరే మోసాలకు పాల్పడిన వారు ఎవరు కూడా తాము మోసగాళ్ళమని అంగీకరించరు కదా ? స్వయంగా న్యాయస్ధానాలే మోసగాళ్ళని తేల్చిన వాళ్ళు కూడా తాము సత్య హరిశ్చంద్రుల వారుసలమని చెప్పుకుని పై కోర్టులకు వెళుతున్నారు. అలాంటిది సుజనా, బాలకృష్ణ వియ్యంకులు తాము ఇన్ సైడ్ ట్రేడింగ్ కు పాల్పడతామని ఒప్పుకుంటారా ?

 

వాళ్ళ సంగతి సరే సత్య హరిశ్చంద్రులకు వారసులమని, తాము నిప్పులాంటి వాళ్ళమని చెప్పుకునే తండ్రి, కొడుకులైనా స్పందించాలి కదా ? ఎందుకంటే మొన్నటి వరకూ సుజనా టిడిపి రాజ్యసభ ఎంపినే. ఏదో చంద్రబాబు అవసరార్ధమే ఆయన బిజెపిలోకి ఫిరాయించారనే ప్రచారం కూడా ఉంది. ఇక రెండో వ్యక్తి లోకేష్ కు తోడల్లుడు భరత్ తండ్రే. మరి ఇద్దరి విషయంలో ఏం జరిగిందన్నది చంద్రబాబు, లోకేష్ జనాలకు చెప్పాలి కదా ? తాను ఆధారాలతో సహా ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయాన్ని బయటపెట్టానని బొత్స అంటున్నారు. అలాంటిది అంత కీలకమైన విషయంపై చంద్రబాబు, చినబాబు ట్విట్టర్లో ఎందుకు స్పందించటం లేదు ?


మరింత సమాచారం తెలుసుకోండి: