టెలికాం రంగంలో పలు సంచలనాలకు తెరలేపిన రిలయన్స్‌ జియో తన ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను రేపు (గురువారం) నాడు ప్రతిష్టాత్మకంగా లాంచ్‌ చేయనుంది. రిలయన్స్ జియో జిగాఫైబర్ పేరుతో ఈ సేవలను దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురానుంది. ఈ మేరకు జియో వెబ్‌సైట్ ద్వారా ఇప్పటికే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. జియో ఫైబర్ సేవల కోసం జియో వెబ్ సైట్‌లో అడ్రస్ తెలిపి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి  ఉంటుందని జియో పేర్కొంది. దేశంలోని 1600 పట్టణాల నుంచి 15 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు  పూర్తయినట్టు సమాచారం. ఇటీవల 42వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం) సందర్భంగా జియో ఫైబర్ బ్రాడ్‌బాండ్‌ వాణిజ్య సేవలను సెప్టెంబర్ 5న ప్రారంభించనున్నామని ఆర్‌ఐఎల్ చైర్మన్ ముకేశ్‌ అంబానీ  ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

అయితే జియో ఫైబర్ ప్లాన్స్ విషయానికి వస్తే.. ప్రీమియం వినియోగదారులకు ప్లాన్‌లు నెలకు రూ. 700 నుంచి రూ. 10వేల వరకు ఉండనున్నాయి. ప్రస్తుతం జియో ఫైబర్ సేవలను ప్రీపెయిడ్ రూపంలో అందిస్తామని, భవిష్యత్‌లో పోస్ట్ పెయిడ్ సేవలను కూడా అందుబాటులోకి తెస్తామని జియో ఇటీవల తెలియజేసింది. జియో ఫైబర్ వెల్ కమ్ ఆఫర్ కింద వార్షిక ప్లాన్‌ను ఎంచుకున్న వినియోగదారులకు  ఫుల్ హెచ్‌డీ టీవీ లేదా 4కే టీవీ, 4కే సెటాప్ బాక్సులను ఉచితంగా జియో అందించనుంది. అంతేకాదు జియో ఫైబర్ ‘జియో ఫస్ట్ డే ఫస్ట్ షో’ ప్లాన్ ను కూడా అందిస్తోంది. ఈ సదుపాయంతో జియో ఫైబర్ ప్రీమియం కస్టమర్లు కొత్త సినిమాలను థియేటర్ కు వెళ్లకుండానే, ఇంట్లో కూర్చొని వీక్షించే అవకాశం కల్పిస్తోంది. అయితే, ఈ సర్వీస్ 2020 మధ్యనాటికి అందుబాటులోకి రానుంది.

 

జియో ఫైబర్ కనెక్షన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి

రిలయన్స్ జియో ఫైబర్ లింక్‌కు వెళ్లండి.  జియో ఫైబర్‌ కనెక్షన్‌ను యాక్సెస్ చేయదలిచిన చోట మీ చిరునామాను నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం తర్వాత పేజీలో పేరు, మొబైల్ నంబర్ ఇ-మెయిల్ ఐడీ వంటి వివరాలను నమోదు చేయాలి.

ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత, మీ  రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. దాన్ని  సంబంధిత బాక్స్‌లో ఎంటర్‌ చేయాలి. ఓటీపీ నిర్ధారించబడిన తర్వాత,  జియో సేల్స్‌ ప్రతినిధికి జియో ఫైబర్‌ కనెక్షన్‌ పొందడానికి అవసరమైన పత్రాన్ని (ఆధార్ కార్డు, ఓటరు ఐడి కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ లలో ఏదో ఒకదాన్ని) అందచేస్తే సరిపోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: