ఎన్ని సార్లు గట్టిగా బుద్ధి చెప్పినా పాకిస్థాన్ తీరు మాత్రం మారడం లేదు. ఇంత కాలం ఉగ్రవాదులతో చొరబాట్లు చేయించిన పాక్... ఇప్పుడు ఏకంగా కమాండోలను దాడులకు పురిగొల్పుతోంది. అయితే... చొరబాటు యత్నాన్ని తిప్పికొట్టిన భారత్ సైన్యం... దాయాది దుష్టబుద్ధిని పక్కా ఆధారాలతో సహా బట్టబయలు చేసింది.
మనతో యుద్ధం చేసే సత్తా లేదు... కవ్వింపులకు మాత్రం కొదవ లేదు... ఇదీ పాకిస్థాన్ పరిస్థితి. ఓ వైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ... మరోవైపు నీతి కబుర్లు చెబుతున్న పాకిస్థాన్కు అంతర్జాతీయ వేదికలపైనా అవమానాలు తప్పడం లేదు. అయినా... సరే దాయాది వక్రబుద్ధిలో మాత్రం మార్పు రావడం లేదు. ఆర్టికల్ 370 రద్దును జీర్ణించుకోలేకపోతున్న పాకిస్థాన్... దానిపై రచ్చ చేయాలనుకున్నా అది సాధ్యం కాలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో పడింది. ఇంత కాలం ఉగ్రవాదులతో చొరబాట్లు చేయించిన పాక్... ఇప్పుడు వ్యూహాన్ని మార్చింది. తమ కమాండోలను సరిహద్దు దాటించి... భారత్లో కీలక లక్షాలపై దాడులకు స్కెచ్చ్ గీసింది.
జమ్మూ-కాశ్మీర్లోని కెరాన్ సెక్టార్ ద్వారా భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు పాకిస్థాన్కు చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్ కమాండోలు. అయితే... ఆ ప్రయత్నాలను భారత్ సైన్యం తిప్పి కొట్టింది. మన సైన్యం దాడిలో పాక్ కమాండోలు హతమయ్యారు. దీనికి సంబంధించిన ఫుటేజ్ను భారత సైన్యం రిలీజ్ చేసింది. జమ్మూ-కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370రద్దు తర్వాత ఆగస్టు తొలి వారంలో ఈ చొరబాటు ప్రయత్నం జరిగింది. నియంత్రణ రేఖ వెంబడి మన నిఘా వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో చెప్పడానికి కూడా ఇదో ఉదాహరణ. పాకిస్థాన్ ఇలాంటి ఎన్ని కుట్రలు చేసినా సమర్థవంతంగా తిప్పికొడతామంటున్నారు మన సైనికులు. ఏది ఏమైనా మన దేశాన్ని నిరంతరం కంటికి రెప్పలా కాపాడే వీరులకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.