హ్యూస్టన్లో జరిగే ప్రధాని మోడీ సభకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరుకానున్నారు. దాదాపు 50వేల మంది భారతీయ అమెరికన్లు ఈ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలను ఈ సభ మరింత బలోపేతం చేయనుంది. మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి.
ప్రధాని మోడీ వచ్చే వారం అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. హ్యూస్టన్లో భారతీయ అమెరికన్లు నిర్వహించనున్న హౌడీ మోడీ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా హాజరవుతారని వైట్ హౌజ్ ధృవీకరించింది. వారం రోజుల అమెరికా పర్యటన సందర్భంగా మోడీ టెక్సాస్లోని హ్యూస్టన్లో అక్కడి భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి దాదాపు 50వేల మంది హాజరు కానున్నారు. ఒకే ప్రదేశంలో ఇంత భారీ ఎత్తున భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ఓ అమెరికా అధ్యక్షుడు ప్రసంగించడం ఇదే తొలిసారి.
ఇరు దేశ ప్రజల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ఈ వేదికను గొప్ప అవకాశంగా భావిస్తున్నట్టు వైట్ హౌజ్ అధికారులు తెలిపారు. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య వ్యూహాత్మక, వాణిజ్య బంధాల్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరముందన్నారు. గత నెల ఫ్రాన్స్లో జీ-7 దేశాల సదస్సులో భాగంగా జరిగిన భేటీలో ట్రంప్ని హ్యూస్టన్ సభకు హాజరుకావాలని మోడీ ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని అమెరికా అధ్యక్షుడు అంగీకరించారు. ఈ పర్యటన సందర్భంగా న్యూయార్క్ లేదా వాషింగ్టన్లో ద్వైపాక్షిక భేటీ కూడా జరిగే అవకాశం ఉంది. ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో మోడీ ఈనెల 27న ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఉభయ దేశాల మధ్య ఓ వాణిజ్య ఒప్పందాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.