మిగిలిన మృతదేహాలు బోటు కిందనే ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నా.. ఇప్పటివరకూ అసలు బోటును బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు ఇంతవరకూ మొదలుపెట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో వివిధ వర్గాల నుంచి వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చే వారు కరవయ్యారు.
పోర్టు అధికారులు ఆ బోటును ఎలా అనుమతించారన్న దిశగా ప్రభుత్వం ఇప్పటిదాకా కనీసం ప్రాధమిక విచారణ కూడా చేపట్టకపోవడం దారుణం. అయితే, ఈ విషాదం నుంచి తప్పుకునేందుకు పోలీసులు అప్పుడే తమ పాత్ర ఏమీ లేదన్న వాదనను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఈ కేసు సమాధి అయినట్లే లెక్క.
మొత్తంగా ఈ కేసులో బోటు యజమానిని విలన్గా చూపించే ప్రయత్నాలే జరుగుతున్నాయే తప్ప... అసలు ఆ బోటును అనుమతించిన అధికారి ఎవరన్న దానిని తెరమరుగు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఘటన జరిగిన తర్వాత అక్కడికి వచ్చిన సీఎం జగన్ ఆసుపత్రికి వెళ్లడం, క్షతగాత్రులను పరామర్శించడం, నష్టపరిహారం ఇస్తామని ప్రకటించపడం వరకూ బాగానే ఉన్నా... సంబంధిత అధికారులను ఇప్పటిదాకా శిక్షించకపోవడం విచారకరం.
ఇక ఈ వ్యవహారంపై ప్రతిపక్ష టిడిపి కంటే అమలాపురం మాజీ ఎంపి హర్షకుమార్ చురుకుగా వ్యవహరిస్తుండటం విశేషం. ఇప్పటివరకూ బోటు ప్రమాదంలో తెరవెనుక వాస్తవాలను బయట ప్రపంచానికి వెల్లడించింది ఆయనే. తాజాగా అసలు బోటులో ఉన్న వారి సంఖ్య 93 మందన్న విషయాన్ని హర్షకుమార్ ప్రకటించి సంచలనం సృష్టించారు. ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని, బోటు బయటకు తీసుకవస్తే తమ అక్రమాలు బయటపడతాయన్న భయంతోనే ఆ పని చేయడం లేదని ఆరోపించారు. పోలీసులు తీసిన ఫొటోలు బయటపెట్టాలని, పోర్టు అధికారి ఒక్కో బోటుకు 2 లక్షలు తీసుకుని అనుమతి ఇస్తున్నారన్న ఆరోపణను తెరపైకి తెచ్చి, సర్కారును ముద్దాయిగా నిలబెట్టారు. ఈ విషయంలో హర్షకుమార్ పోషిస్తున్న పాత్ర బాధిత కుటుంబాలకు ఊరట నిస్తోంది.
అయితే విపక్షమైన టిడిపి ఈ వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చి, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాల్సి ఉండగా, ఆ పార్టీ ఎందుకో చైతన్యరహితంగా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే బోటు ఘటన మరుసటిరోజునే కోడెల శివప్రసాద్రావు ఆత్మహత్య వ్యవహారం కూడా దానికి కారణం కావచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కనీసం ఆ వ్యవహారాన్ని ఉభయ గోదావరి జిల్లా టిడిపి నేతలు కూడా విస్మరించడం చూస్తే.. టిడిపి నేతలు ఆ రెండు జిల్లాల్లో స్తబ్దతగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.