కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రులు అవినీతికి పాల్పడకుండా నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘నేమ్ అండ్ షేమ్` (ఆస్పత్రుల పేర్లను బహిరంగపరచటం) కార్యక్రమంలో భాగంగా పేర్లను ప్రకటించింది. అక్రమాలకు పాల్పడినట్లు తేలిన 111 దవాఖానల పేర్లను ఆయుష్మాన్ భారత్ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ
మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఆయుష్మాన్ భారత్- ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై) పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటుచేసిన ‘ఆరోగ్య మంతన్' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆస్పత్రులు అవినీతికి పాల్పడకుండా నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘నేమ్ అండ్ షేమ్స (ఆస్పత్రుల పేర్లను బహిరంగపరచటం) కార్యక్రమంలో భాగంగా వీటి పేర్లను వెబ్సైట్లో పెట్టామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ఆరోగ్య కార్యక్రమం.. ఆయుష్మాన్ భారత్ను గత ఏడాది ప్రధానమంత్రి నరేంద్రమోదీ జార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ తొలుత కొందరు లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ కార్డుల్ని అందజేశారు. అనంతరం జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో భారత్ సరికొత్త మెడికల్ హబ్గా మారుతుందని చెప్పారు. ఈ తరహా బృహత్ ఆరోగ్య కార్యక్రమం ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య అభియాన్ (పీఎంజీఏవై) పథకానికి ప్రజలు మోదీ కేర్ అంటూ పలురకాల పేర్లు పెడుతున్నారని, కానీ తాను మాత్రం దీనిని పేద ప్రజలకు సేవచేసే అవకాశంగా భావిస్తున్నానని చెప్పారు. సమాజపు అట్టడుగు వర్గాలకూ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. రాబోయే రోజుల్లో వైద్యరంగంలో ఉన్నవారు ఈ పథకాన్ని బట్టి తమ తమ కొత్త స్కీములను తీసుకువస్తారు. గుండె, కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులు, మధుమేహం వంటివాటితోపాటు మొత్తం 1300 రకాలైన వ్యాధులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ప్రపంచంలో అమలవుతున్న అతిపెద్ద ప్రభుత్వం పథకం ఇదే.
కాగా, ఈ పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన నేపథ్యంలో కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ...‘నేమ్ అండ్ షేమ్ కార్యక్రమంలో భాగంగా అక్రమాలకు పాల్పడిన 111 దవాఖానలను ఆయుష్మాన్ భారత్ వెబ్సైట్లో పొందుపరిచాం. అంతేగాకుండా వాటిని పథకం నుంచి తొలిగించాం. మరోవైపు, ఈ పథకం కింద ఉత్తమ పనితీరు కనబరచిన దవాఖానలను గౌరవించేందుకు నేమ్ అండ్ ఫేమ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. అక్రమాలకు సంబంధించి సుమారు 1,200 కేసులు నమోదయ్యాయని, 338 దవాఖానలపై చర్యలు తీసుకున్నామన్నారు. 8 దవాఖానలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, రూ.1.5 కోట్ల జరిమానా విధించామని చెప్పారు. దేశవ్యాప్తంగా 32 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ పథకాన్ని అమలుచేస్తున్నాయన్న ఆయన, మిగిలిన నాలుగు రాష్ర్టాలు అమలుచేయకపోవడంపట్ల విచారం వ్యక్తం చేశారు.