రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే మొదటి ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్కు సింబల్స్ టెన్షన్ పట్టుకుందా..? గతంలో కొన్ని గుర్తుల వల్లే అసెంబ్లీలో తమ అభ్యర్థులు ఓటమి చెందారని కారు గుర్తు పార్టీకి... ఇప్పుడు మళ్లీ అదే భయం పట్టుకుందా..? గులాబీ దళానికి గతంలో షాక్ ఇచ్చిన ఆ సింబల్స్ హుజూర్నగర్ ఉపఎన్నికల్లో కూడా ఉన్నాయా..?
హుజూర్నగర్ ఉపఎన్నిక ప్రధాన పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్ కంచుకోటపై గులాబీ జెండా ఎగుర వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిన అధికార పార్టీకి ప్రస్తుతం సింబల్స్ టెన్షన్ పట్టుకుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా వెళ్లడంతో వచ్చిన హుజూర్నగర్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని భావిస్తున్న టీఆర్ఎస్.. గెలుపై లక్ష్యంగా పక్కా వ్యూహాలు రచిస్తూ.. మండలానికో మంత్రిని పెట్టడమే కాక, కులానికో ఇంఛార్జ్లను నియమించింది. అయితే ఆ నేతలను ఇప్పుడు సింబల్స్ ఆందోళనలో పడేశాయి.
గత ఏడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ, ఏప్రిల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కొన్ని గుర్తులు టీఆర్ఎస్ సింబల్ కారును పోలి ఉండడంతో అధికార పార్టీ అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా ఆటో, ట్రక్కు, రోడ్ రోలర్ లాంటి గుర్తుల వల్ల ఓటర్లు గందరగోళపడ్డారు. ముఖ్యంగా వృద్ధులకు.. నిరక్ష రాస్యులకు అర్ధం కాకపోవడంతో వాళ్లు కారు గుర్తుకు వేయాల్సిన ఓటు ఇతర సింబల్స్పై వేశారు. ఆ విషయం ఫలితాల్లో చాలా స్పష్టంగా కనిపించింది.
హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీకి అదే భయం పట్టుకుంది. ఈ ఎన్నికల్లో కూడా కారును పోలిన ట్రాక్టర్, రోడ్డు రోలర్ గుర్తులున్నాయి. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని... ఈ సారి కారు సింబల్పై ప్రజలకు అవగాహన కల్పించాలని క్యాడర్కు దిశానిర్దేశం చేశారు గులాబీ బాస్.