నుస్రత్ జహాన్... ప్రముఖ బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ.నుదుట సింధూరం, చీర ధరించి జూన్ 25న ఎంపీగా నుస్రత్ జహాన్ లోక్సభలో ప్రమాణం చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. దీనిపై ముస్లిం మతపెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువును పెళ్లి చేసుకొన్న జహాన్కు తన ఇష్టానుసారం హిందూ మతానికి చెందిన బొట్టు, మంగళసూత్రం ధరించే హక్కు ఉందన్నారు. ఎంపీ అయిన తర్వాత తొలిసారి జరుపుకొంటున్న
దసరా శరన్నవరాత్రి సందర్భంగా కోల్కతాలో భర్త నిఖిల్జైన్తో కలిసి సురుచి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన దుర్గా పూజలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దుర్గాష్టమి వేడుకల్లో సంగీత వాయిద్యమైన ధాక్ వాయించి అందరినీ ఆకట్టుకొన్నారు. అయితే, దీనిపై మతపెద్దలు మళ్లీ భగ్గుమన్నారు.
నుస్రత్ తీరును దారుల్ ఉలూం దేవబంద్కు చెందిన మతపెద్దలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దుర్గాపూజలో పాల్గొనడంపై ముస్లిం మతపెద్దలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ``ముస్లిం మహిళ బొట్టు, మంగళసూత్రం ధరించి హిందూ దేవతలకు పూజలు చేయడం ముస్లిం మతాచారం కాదు. ఇస్లాం తన అనుచరులు అల్లాహ్ను మాత్రమే ప్రార్థించాలని ఆదేశిస్తున్నది. ఒకవేళ ఎంపీ జహాన్ పూజలు చేయాలనుకొంటే పేరు, మతం మార్చుకొంటే మాకెలాంటి అభ్యంతరం లేదు`` అని దారుల్ ఉలూం దేవబంద్కు చెందిన ముఫ్తీ అసద్ ఖాస్మీ చెప్పారు.
అయితే, నుస్రత్కు పలువురు మద్దతు పలికారు. నుస్రత్ జహాన్ పూజలు చేయడంలో తప్పేమీ కనిపించడం లేదని ఉత్తర్ప్రదేశ్కు చెందిన షియా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ వాసీం రిజ్వీ సమర్ధించారు. ఆమె తన భర్తతో కలిసి పూజలో పాల్గొనడంలో తప్పు పట్టే అంశమేమీ కాదన్నారు. అయితే, దీనిపై ఎంపీ స్పందిస్తూ..పూజ తన వ్యక్తిగత వ్యవహరమని...తానేమీ నిబంధనలకు, మతాచారానికి వ్యతిరేకంగా వ్యవహరించలేదన్నారు. ‘‘నా పేరు మార్చుకొమ్మనే హక్కు వారికి లేదు. నాకు పేరు ఇచ్చింది వాళ్లు కాదు. అన్ని మతాలను గౌరవించడం మత సామరస్యంలో భాగం. నేను పుట్టి పెరిగిన సంస్కృతి అదే నేర్పింది. దానికి అనుగుణంగానే నేను నడుచుకుంటున్నాను’’ అని తనపై విమర్శలు చేసిన వారికి చురకలు అంటించారు.