దేశ రాజకీయాల చూపు మొత్తం మహారాష్ట్ర హర్యానా ఎలక్షన్ ల పైనే ఉంది . హరియాణా ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందొనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక హర్యానాలో అన్ని పార్టీలు గెలుపు కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. అయితే హర్యానాలో ఈనెల 21న ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం నిర్ణయించినట్లు ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా తెలిపిన విషయం తెలిసిందే. ఎన్నికల తేదీ విడుదలకు ముందు నుంచే అన్ని పార్టీలు గెలుపు కోసం పావులు కదుపుతున్నాయి. ఓ వైపు కాంగ్రెస్ మరో బిజెపీ లు గెలుపే లక్ష్యంగా తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కు కంచుకోట అయినా ఆదంపూర్ నియోజకవర్గం నుంచి టిక్ టాక్ లో బాగా ఫేమస్ అయ్యి స్టార్ గా మారిన సోనాలి అనే మహిళకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది బిజెపి. ఎలాగైనా ఆదంపూర్ గెలవాలనే ఉద్దేశ్యం తోనే సొనాలికి టికెట్ ఇచ్చునట్లు బీజేపీ తెలిపింది.
ఆదంపూర్ లో పటిష్టంగా ఉన్న కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకే బిజెపి ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిజెపి నేతలు తెలిపారు. అయితే ఒక టిక్ టాక్ స్టార్ కి శాసనసభ స్థానానికి పోటీ చేయడానికి సీట్ కేటాయించటం తో ఈ అంశం హర్యానా ఎలక్షన్ లో హాట్ టాపిక్ గా మారింది. బిజెపి పక్కా ప్లాన్ తోనే టిక్ టాక్ స్టార్ అయిన సోనాలి ని బరిలోకి దింపింది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈసి ఇప్పటికే హర్యానాలో ఎన్నికల కోడ్ విధించింది. ఎన్నికలు సమీపిస్తుండడంతో హర్యానాలోని ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ పార్టీలు సర్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా ఈ నెల 21న ఎన్నికలు జరగనుండగా 24న ఫలితాలు వెలువడనున్నాయి.
కాగా ఈసారి హర్యానాకు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఎన్నికల ఇన్చార్జిగా నియమింపబడ్డారు. అయితే హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 1.83 కోట్ల ఓటర్లు హర్యానాలో ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు ఈసీ తెలిపింది. కాగా హర్యానా ఎలక్షన్లలో ప్రజలు ఎక్కువగా బిజెపి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే దేశ ప్రధాని మోదీ కీలక నిర్ణయాలతో దేశ ప్రజలందరినీ ప్రభావితం చేస్తుండడం... ఇక గత పార్లమెంట్ ఎలక్షన్లలో రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించి దేశ ప్రజలందరూ తమ అధికారాన్ని కోరుకుంటున్నారని చాటి చెప్పడంతో హర్యానా ప్రజలు కూడా బిజెపి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.మరి ఎన్నికల తర్వాత ఎవరు అధికారాన్ని చేజిక్కించుకుంటారు అనేది వేచి చూడాలి.