ఇది తాజాగా
విశాఖపట్నం రెండు రోజుల పర్యటనలో చంద్రబాబునాయుడు చేసిన తాజా వ్యాఖ్యలు. కేంద్రంతో
విభేదించి నష్టపోయింది వాస్తవమా ? కాదా ? అన్నది పక్కన పెడితే నష్టపోయింది ఎవరు ?
అన్నదే ప్రధాన ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం
అంటే బిజెపి అనే అర్ధమన్న విషయం అందరకీ తెలిసిందే.
కేంద్రంతో విభేదించటం వల్ల చంద్రబాబు వ్యక్తిగతంగా నష్టపోయారన్న మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే కలిసున్న నాలుగేళ్ళ కాలంలో కూడా చంద్రబాబు వ్యక్తిగతంగా లాభపడ్డారే కానీ రాష్ట్రానికి జరిగిన లాభం ఏమీలేదనే చెప్పాలి. ప్రత్యేకహోదా సాధించలేకపోయారు. విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ సాధించటంలో విఫలమయ్యారు. లోటు బడ్జెట్ రూ. 16 వేల కోట్లను సాధించటంలో ఫెయిల్ అయ్యారు.
ఇక చంద్రబాబు వ్యక్తిగతంగా లాభపడిందేమిటంటే పోలవరంతో పాటు అన్నీ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో భారీగా అవినీతికి పాల్పడినా కేంద్రం పట్టనట్లు వదిలేసింది. వివిధ పథకాలకు కేంద్రం నుండి వచ్చిన నిధులు అవినీతితో పక్కదారి పడుతున్న విషయం తెలిసినా పట్టించుకోలేదు. ఇలా నాలుగేళ్ళు తనిష్టారాజ్యంగా చెలాయించుకున్న చంద్రబాబు తర్వాత తన స్వార్ధం కోసమే బిజెపితో విభేదించారు.
మొన్నటి ఎన్నికల్లో బిజెపి ఓడిపోతుందన్న అంచనాతోనే కమలం పార్టీతో చంద్రబాబు విభేదించిన విషయం తెలిసిందే. అయితే బిజెపి గెలిచి చంద్రబాబు ఓడిపోయారు. అంచనా దారుణంగా తప్పటంతో చంద్రబాబు తలబొప్పి కట్టింది. అలాంటిది వాస్తవాలను కప్పిపుచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంతో విభేదించినట్లు అబద్ధాలు చెబుతున్నారు.
కేంద్రంతో విభేదించటం వల్ల టిడిపి కూడా నష్టపోయిందంటున్న మాట కూడా తప్పే. ఎందుకంటే బిజెపితో కలిసున్నా రాష్ట్రంలో మాత్రం తెలుగుదేశంపార్టీ ఓటమి ఖాయమే. ఎందుకంటే ఐదేళ్ళ పాలనలో ఒక్క కమ్మ సామాజికవర్గం తప్ప మరే సామాజికవర్గం ప్రజలు సంతోషంగా లేరన్నది వాస్తవం. ఆకాశమంతగా పెరిగిపోయిన అవినీతి, పెరిగిపోయిన అరాచకాలతో జనాలు విసిగిపోయారు. కాబట్టి బిజెపితో కలిసున్నా, విడిపోయిన ఓటమి మాత్రం ఖాయమన్న విషయాన్నే చంద్రబాబు అంగీకరించలేకపోతున్నారు.