తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ కార్మికులు చేస్తున్న సమ్మె తొమ్మిదో రోజుకు చేరుకుంది. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం పరిష్కారం దిశగా అడుగులు వేయకపోగా ప్రత్యామ్నాయం దిశగా ఆలోచించింది. అంతేకాకుండా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించడం కుదిరేపని కాదని చెప్పిన ప్రభుత్వం సమ్మె చేస్తున్న కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయిపోయినట్టే అని ప్రకటించింది. ఇక ఆర్టీసీ సమ్మె పై స్పందించిన రవాణా శాఖ మంత్రి మంత్రి పువ్వాడ అజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తానెప్పుడూ చెప్పలేదని. ఆర్టీసీ సమ్మె అసంబద్ధ మైనదని... హామీ ఇవ్వక పోయినప్పటికీ ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపితే కార్మికులు మాత్రం ఏకపక్షంగా వ్యవహరించి చర్చల నుండి వెళ్లిపోయారని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు.
సమ్మె మొదలు పెట్టి తొమ్మిది రోజులు అయినప్పటికీ ప్రభుత్వం కార్మికుల డిమాండ్లను పరిష్కరించే ఆలోచించన చేయక పోవడం తో...ఇక లాభం లేదు అనుకున్న ఆర్టీసీ జేఏసీ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని డిసైడ్ ఐపోయింది. ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ కి ప్రతిపక్షాలు అండగా నిలవటంతో ఉద్యమం ఉధృతం చేసి ప్రభుత్వం పై ఉక్కుపాదం మోపుతామని అంటుంది ఆర్టీసీ జేఏసీ . దీంతో ఇప్పటికే మద్దతు తెలిపిన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, టిడిపి, బిజెపి, సిపిఐ, సీపీఎం పార్టీల మద్దతుతో... రోజుకో రకంగా నిరసన తెలుపుతామని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. దీనికి సంబంధించి కార్యాచరణ కూడా ప్రకటించింది ఆర్టీసీ జేఏసీ.
ఈ క్రమంలోనే నేడు వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపనున్నారు ఆర్టీసీ కార్మికులు. కాగా 14న డిపో ఎదుట బైఠాయింపు, ఆర్టీసీ కార్మికుల సభలు, 15న రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాస్తారోకోలు, 16న విద్యార్థులతో కలిసి ర్యాలీలు , 17 న రాష్ట్ర వ్యాప్తంగా ధూమ్ దాం, 18న బైక్ ర్యాలీలు, 19న తెలంగాణ బంద్ నిర్వహించనున్నారు . నిరసనలు వ్యక్తం చేస్తున్న సమయంలో ప్రభుత్వం అరెస్టులకు దిగిన లాఠీచార్జీలు చేసిన... ఎక్కడ వెనక్కి తగ్గేది లేదని ఆర్టీసీ కార్మికులు స్పష్టం చేశారు. అటు ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలను సహించబోమని కార్మికులను క్షమించేది లేదని తేల్చి చెప్పారు.