తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుందని రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏఐఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు కీలక మద్దతు దక్కిందని అంటున్నారు. ప్రధానప్రతిపక్షంగా అవతరించిన ఎంఐఎం ఇందుకు సహకరించి టీఆర్ఎస్కు కృతజ్ఞత చెల్లించుకోవడంలో భాగంగా...కీలకమైన ఆర్టీసీ సమ్మె విషయంలో స్తబ్ధుగా వ్యవహరిస్తోందని అంటున్నారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇవ్వకపోవడం, కనీసం బంద్కు కూడా సంఘీభావం తెలుపకపోయిన నేపథ్యంలో పలువురు టీఆర్ఎస్-ఎంఐఎం దోస్తీని ఆసక్తికర రీతిలో విశ్లేషిస్తున్నారు.
గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను 88 చోట్ల టీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ తర్వాత ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున గెలుపొందిన కోరుకంటి చందర్, స్వతంత్ర అభ్యర్థి రాములు నాయక్, టీడీపీ ఎమ్మెల్యే
సండ్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్లో చేరడంతో పార్టీ బలం 91కి పెరిగింది. కాంగ్రెస్కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ కండువా కప్పుకోవడంతో అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 103కి చేరింది. 119 మంది శాసనసభ్యులు ఉన్న అసెంబ్లీలో కనీసం పది శాతం మంది ఎమ్మెల్యేలు కలిగి ఉన్న పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి కేవలం ఆరుగురు శాసనసభ్యుల మద్దతు మాత్రమే ఉంది. దీంతో ఏడుగురు ఎమ్మెల్యేలను కలిగిన ఏఐఎంఐఎం అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
ఇలా ప్రధానప్రతిపక్షంగా అవతరించిన ఎంఐఎం తాజా ఆర్టీసీ సమ్మె విషయంలో అనుసరించిన వైఖరిని రాజకీయవర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షమైన మజ్లిస్ పార్టీ నేతలు సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఇవాళ్టి దాకా మద్దతు పలకలేదు. కనీసం సమ్మెను వ్యతిరేకిస్తున్నట్లు, వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించనే లేదు. ఆర్టీసీ ఆధ్వర్యంలో ఇస్తున్న తెలంగాణ బంద్లో కూడా పాల్గొనలేదు. కనీసం వ్యతిరేకించలేదు. ప్రజలకు మద్దతు పలకకుండా కూడా ప్రధాన ప్రతిపక్షం గా కూడా వ్యవహరించవచ్చన్నమాట అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.