’నేతన్న నేస్తం కొందరికేనా’... ఇది తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య. ’రాష్ట్రంలో 2.80 లక్షల మంది చేనేత కార్మికులుంటే వారిలో 81,240 మందికి మాత్రమే నేతన్న నేస్తం పథకం వర్తింపచేయటం సహేతుకం కాదం’టూ పవన్ మండిపడ్డాడు. షెడ్డూల్లో మగ్గాలు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్న కార్మికులకు, కూలీకి మగ్గంపని చేసుకునే వారికి ఈ పథకం వర్తించకపోవటం అన్యాయమంటూ ఆవేధన వ్యక్తం చేశాడు.
ఆవేధన వ్యక్తం చేయటం వరకు బాగానే ఉంది కానీ పవన్ మరచిపోయిన విషయం ఒకటుంది. పథకం లాంచ్ చేసినపుడు మగ్గంఉన్న చేనేతలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. పథకం మార్గదర్శకాల ప్రకారమే ప్రభుత్వం చేనేత సొసైటీలతో మాట్లాడి, సర్వే నిర్వహించి లబ్దిదారుల జాబితాను రెడీ చేసింది. దాని ప్రకారమే 81 వేల కుటుంబాలు మగ్గం మీద ఆధారపడినట్లు తేలింది. కాబట్టి ఆ కుటుంబాలకే నేతన్న నేస్తం పథకం వర్తిస్తోంది.
ఇందులో చేనేతలను ప్రభుత్వం అన్యాయం చేస్తన్నదేమీ లేదు. లబ్దిదారుల జాబితాను ప్రభుత్వం చేనేత సొసైటీలకు అందుబాటులో ఉంచిన విషయం పవన్ కు తెలీదేమో. మగ్గం ఉన్న కుటుంబాలు ఏవైనా లబ్దిదారుల జాబితాలో లేకపోతే ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలని కూడా ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేస్తున్న విషయాన్ని పవన్ మరచిపోయినట్లున్నాడు. మార్గదర్శకాల ప్రకారం తమ పేరు లేదని ఎవరైనా అనుకుంటే వాళ్ళు వెంటనే సంబంధిత అధికారులను కలిస్తే సరిపోతుంది.
పవన్ చెబుతున్నట్లుగా పడుగు-పేక, ఆసుపోయటం లాంటి అనుబంధ పనులు చేసే వాళ్ళకు కూడా నేతన్న నేస్తం పథకాన్ని వర్తింపచేయాలని కోరటంలో తప్పేమీ లేదు. అయితే రెండు రోజుల క్రితం హిందుపురం మాజీ ఎంపి, సీనియర్ టిడిపి నేత నిమ్మల కిష్టప్ప చేసిన డిమాండ్ నే ఇపుడు పవన్ కూడా చేస్తున్నాడు. చేనేత కార్మికులతో టెలికాన్ఫరెన్సు తర్వత తాను కొత్తగా డిమాండ్ చేస్తున్నట్లుగా పవన్ బిల్డప్ ఇస్తున్నాడంతే. టిడిపి అడగుజాడల్లోనే పవన్ నడుస్తున్నాడనేందుకు తాజా డిమాండే ఉదాహరణ.