వృద్ధుడంటే ఇంట్లో ఓ చోట కూర్చుని తనపని తాను చేసుకుంటూ పోవాలి కానీ ఇలామాత్రం చేయకూడదు.. ఆ వృద్ధుడు ఫేస్‌బుక్ వాడుతున్నాడు. హాయ్ అంటూ.. అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. ఇంతలో అమ్మాయి కదా అని ఆ మహిళతో స్నేహం చేశాడు.  త్వరగానే మాటలు కలిశాయ్. సొంత విషయాలూ చెప్పుకునేంత వరకూ వెళ్లింది వ్యవహారం. ఆ మహిళ బుట్టలో పడిపోయాడు ఆ పెద్దాయన. రిటైర్మెంట్ తర్వాత వినియోగించుకోవాల్సిన సొమ్మంతా ఆ మాయలేడికి సమర్పించేసుకున్నాడు. చివరికి మోసపోయానంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో నిందితుల ఆటకట్టించారు.

 సోమిర్ కుమార్ దాస్‌ ఎంఎంటీఎస్‌లో పనిచేసి రిటైర్ అయ్యాడు. రోజ్ అనే మహిళ ఫేస్‌బుక్ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. విదేశాల్లో ఉంటానని పరిచయం చేసుకుంది ఆ మహిళా. వారిరువురికి కొద్దికాలంలోనే చనువు పెరిగింది. ఆర్థిక విషయాలు మాట్లాడుకునే స్థాయికి వెళ్లింది ఆ పరిచయం. అవతల ఉన్నది సైబర్ నేరగాళ్లని తెలియక దాస్ అన్ని విషయాలు ఆమెతో పంచుకున్నారు. నమ్మకంగా మాట్లాడుతుండడంతో దాస్ ఆమె బుట్టలో పడిపోయాడు. తాను రిటైర్ అయ్యానని చెప్పడంతో విదేశాల నుంచి గిఫ్ట్ పంపిస్తానని చెప్పింది. విదేశాల నుంచి గర్ల్‌ఫ్రెండ్ గిఫ్ట్ పంపించానని చెప్పగానే ఎగిరిగంతేశాడు. ఫేస్‌బుక్ ఫ్రెండ్‌షిప్ కొంపముంచుతుందని ఊహించలేకపోయాడు. తీరా తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

సడెన్‌గా ఆ పెద్దాయనకు ఓ రోజు ఎయిర్‌పోర్టు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీకు పెద్ద ఎత్తున ఫారిన్ కరెన్సీ వచ్చింది. అవి కావాలంటే కస్టమ్స్ డ్యూటీ కట్టాలన్నది సారాంశం. పాపం ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ని నమ్మిన దాస్ తన ఏడు ఖాతాల వివరాలు టపీమని చెప్పేశాడు. అలాగే ఆ ఖాతాల్లో ఉన్న రూ.34 లక్షలను వెంటనే ఆ ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేసేశాడు. ఇంకేముంది విదేశీ కరెన్సీ మొత్తం మనదేనని సంబరపడ్డాడు. 

మరల అదే నంబర్‌కి కాల్ చేస్తే ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో ఆ పెద్దాయనకి బుర్రగిర్రున తిరిగింది. ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తే స్నేహితురాలి అకౌంట్ క్లోజ్ అని కనిపించింది. దాంతో తాను మోసపోయానని గ్రహించిన దాస్ విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి జరిగిందంతా చెప్పేశారు. విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సైబర్ పోలీసులు నిందితులను ట్రేస్ చేశారు. ఈ తతంగమంతా ఢిల్లీ నుంచి జరిగిందని తెలుసుకుని అక్కడికి వెళ్లి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వాళ్ల వద్ద కేవలం రూ.2 లక్షలు మాత్రమే రికవరీ చేయగలిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: