చాలామందికి శ్రీకృష్ణుడు అంటే పరమభక్తి. మహావిష్ణువు ఎనిమిదవ అవతారమైన కృష్ణుడు తన భక్తులను, మంచిని ప్రేమించే వ్యక్తి. చిలిపి బాలునిగాను, పశువులకాపరిగాను, రాధా గోపికా మనోహరునిగాను, రుక్మిణీ సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగాను, గొపికల మనసు దొచుకున్నవాదిగాను యాదవరాజుగాను, అర్జునుని సారథియైన పాండవ పక్షపాతిగాను, భగవద్గీతా ప్రబోధకునిగాను, తత్త్వోపదేశకునిగాను, దేవదేవునిగాను, చారిత్రిక రాజనీతిజ్ఞునిగాను ఇలా ఇలా బహు విధాలుగా శ్రీకృష్ణుని రూపాలు ఇతిహాసాలలో చెప్పబడ్డాయి. అలాగే శ్రీకృష్ణుడ్ని శృంగార రూపంగా భావిస్తారు. ఏ అవతార పురుషునికీ లేనన్నీ భార్యలు శ్రీకృష్ణుడికి ఉంటారు.
ఈ కిట్టయ్య అల్లరి పనులు అన్నీ ఇన్నీ కావు. ఆ చిన్ని కృష్ణుని చిలిపి పనులు చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. గోకుల బాలకునిగా కన్నయ్య నడిపిన మధుర లీలలు వింటే ప్రతి ఒక్కరూ పరవశించాల్సిందే. శ్రీకృష్ణుడికి రుక్మిణి, సత్యభామ తదితర అష్ఠ మహిషులు, పదహారు వేల వంద మంది భార్యలు ఉన్నారు. అష్టమహిషులు అంటే శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలు. ఈ అష్ట మహిషులే కాక మిగిలిన పదహారు వేల వంద మంది కృష్ణుడి భార్యలకు కూడా ఆయన తన ప్రేమను పంచగలగటం, దానిని వారు పోటీపడి స్వీకరించటం చాలా గొప్ప విషయం.
అయితే వాస్తవంగా చెప్పాలంటే.. శ్రీకృష్ణుడు, రుక్మిణీదేవిలది అసలైన ప్రేమ వివాహం. రుక్మిణీదేవి విదర్భరాజు భీష్మకుని కూతురు. రుక్మిణీదేవి సందేశాన్ని అందకొని స్వయంవర సమయంలో ఎత్తుకొచ్చి వివాహం చేసుకొన్నాడు. అన్యాయంగా, బలవంతంగా లాక్కువెళ్ళి పెళ్ళి చేసుకొన్నాడని శిశుపాలుడు ఆరోపించాడు. కాని వీళ్లిద్దరిది స్వచ్ఛమైన ప్రేమవివాహం. ఇక కృష్ణుడు సత్యభామను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. సత్రాజిత్తు కూతురు సత్యభామ. కృష్ణుణ్ణి అపనిందలకి గురిచేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా తన కూతుర్నిచ్చి పెళ్ళిచేస్తాడు. ఈమె భూదేవి అవతారం.
అలాగే మిగిలిన భార్యలను కూడా అనివార్య కారణాల వల్లే పెళ్లి చేసుకున్నాడు ఈ పరమాత్ముడు. ఇక శ్రీకృషుడికి 16 వేలమంది గోపికలు అయన భార్యలుగా చెబుతుంటారు. దీని వెనక కూడా ఓ కథ ఉంది. శ్రీకృష్ణుడు నరకాసురున్ని వధిస్తాడు కదా. అయితే నిజానికి నరకాసురుడు కామాంధుడు. 16,100 మంది స్త్రీలను తెచ్చి అంతఃపురంలో బందీలను చేసుకుని వారిని నిత్యం చిత్రహింసలకు గురి చేసేవాడు. ఆ 16,100 మందిని నరకాసురుడు తన శృంగారానికి బానిసలుగా చేసుకున్నాడు. వారికి నరకం చూపించేవాడు.
ఈ క్రమంలో అతను కృష్ణుడి చేతిలో చనిపోగానే వారికి స్వేచ్ఛ లభిస్తుంది. కానీ వారు తిరిగి సొంత స్థలాలకు వెళ్లలేకపోతారు. ఎందుకంటే పరాయి పురుషుడి ఆధీనంలో వారు అప్పటివరకు ఉన్నారు కాబట్టి వారిని ఎవరూ స్వీకరించలేదు. వారికి వివాహాలు కాలేదు. దీంతో కృష్ణుడు ఏం చేశాడంటే వారందరినీ తన భార్యలుగా ప్రకటించి రాణి హోదాలను ఇచ్చాడు. అలా ఆయనకు మొత్తం 16,108 మంది భార్యలు అయ్యారు. అందుకే రాముడు ఏకపత్నీవ్రతుడు... కృష్ణుడు లీలల నాథుడు అని అంటారు