హనుమంతుడు, హనుమాన్, ఆంజనేయుడు ఇలా రకరకాల పేర్లతో ఆ ఆంజనేయ స్వామిని పిలుస్తుంటారు. హిందూ మతం పురాణాలలో అత్యంత ప్రసిద్ధమైన పాత్రలలో హనుమంతుని పేరు చాలా ప్రముఖంగా ఉంటుంది. తన యొక్క భక్తిప్రపత్తులతో రాముని గుండెలలో దాచుకున్న మహానుభావుడు ఈ ఆంజనేయుడు. ఇక బలవంతుడు, శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువ కలిగిన దేవుడు హనుమంతుడు. అందుకే హనుమాన్ గురించి ఆలోచించగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన బలంమే. మరియు ఎలాంటి భయాలు కలిగినా.. పెద్దవారు హనుమంతుడిని తలుచుకోమని చెబుతుంటారు. శ్రీరాముడి పరమ భక్తుడైన ఆజన్మ బ్రహ్మచారి ఆంజనేయుడికి దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా గుడులు దర్శనమిస్తాయి.
ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ హనుమంతున్ని స్త్రీ రూపంలో పూజించే దేవాలయం కూడా ఒకటి ఉందని మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఛత్తీస్ ఘర్ రాష్ట్రంలోని రతన్ పూర్ జిల్లాలో గిర్జబంద్ లో ఈ అరుదైన ఆంజనేయస్వామి ఆలయం ఉంది. ఆలయంలో హనుమంతున్ని దేవత రూపంలో పూజిస్తున్నారు. ఈ ఆలయంలో దేవత రూపంలో ఉన్న హనుమంతున్ని ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని వారు విశ్వసిస్తారు.
గిర్జబంద్ ప్రాంతంలో ఈ హనుమాన్ ఆలయం ఎన్నో సంవత్సరాలుగా ఉంది. రతన్ పూర్ రాజు అయిన పృధ్వీ దేవ్ రాజు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆంజనేయుడిపై అపారమైన భక్తి గల పృధ్వీ దేవ్ రాజు కుష్టు వ్యాధికి గురై తీవ్ర నిరాశలో మునిగిపోయాడు. ఆ టైమ్లోహనుమంతుడు అతడి కలలో కనిపించి తనకు ఆలయం నిర్మించమని.. మహామాయ కుండ్ వద్ద ఓ విగ్రహం ఉంటుందని, దానిని తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్టించాలని ఆదేశించి అదృశ్యమవుతాడు.
ఈ క్రమంలోనే ఆలయాన్ని నిర్మించి.. హనుమంతుడి సూచనల ప్రకారం అక్కడకు వెళ్లి చూడగా అక్కడ హనుమాన్ విగ్రహం స్త్రీ రూపంలో ఉంటుంది. ఇక భగవంతుడు తనకు చెప్పినట్టుగానే ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి ఆలయం లోపల ప్రతిష్ట చేస్తాడు. అయితే ఆ వెంటనే పృధ్వీ దేవ్ రాజు కుష్టు వ్యాధి నుంచి బయట పడతాడు. ఈ విషయం ఆ నోట, ఈ నోట పాకి ఆంజనేయుడి ఆలయాన్ని దర్శంచడం మొదలు పెట్టారు.