హనుమంతుడు, హనుమాన్, ఆంజనేయుడు ఇలా రకరకాల పేర్లు కలిగిన ఆంజనేయ స్వామి.. ఈ జగమందు సప్త చిరంజీవులలో ఒకరు. బలవంతుడు, శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువ కలిగిన దేవుడు హనుమంతుడు. అందుకే హనుమాన్ గురించి ఆలోచించగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన బలం. ఇక హిందూ మతం పురాణాలలో అత్యంత ప్రసిద్ధమైన పాత్రలలో హనుమంతుని పేరు ప్రముఖం.
తన యొక్క భక్తిప్రపత్తులతో రాముని గుండెలలో దాచుకున్న మహానుభావుడు హనుమంతుడు. అయితే మధ్యకైలాష్లో ఈ హనుమంతుడి వినాయకుడితో కలిసి ఉంటాడు. అది కూడా ఒకే విగ్రహంలో. పూర్తివివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులో చెన్నై నగరం అడయార్ ప్రాంతంలో మధ్యకైలాష్ లో ఉన్న ఆనంద వినాయకుని ఆలయంలో ఈ విగ్రహం ఉంది. ఈ విగ్రంలో సగం వినాయకుడు , సగం హనుమంతుడు కొలువై ఉన్నారు. ఆదిలో వినాయకుడిని, ముగింపులో హనుమంతుడిని పూజిస్తారు.
ఆద్యంతాలకు ప్రతీక అయిన ఈ స్వామిని `ఆద్యంత ప్రభు` అంటారు. హనుమంతుడు, వినాయకుడు వేర్వేరైనా, తత్త్వం ఒక్కటే. ఇక బ్రహ్మచారులైన విఘ్నేశ్వరుడు, ఆంజనేయస్వామివార్లు వారి అర్ధ శరీరాలతో ఏకమైనట్లు ఏర్పాటైన విగ్రహం భక్తులను ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులు తమకు కైలాసాన్ని దర్శించినంత అనుభూతి కలుగుతోందని చెబుతున్నారంటే, ఈ ఆలయం వారిలో ఎంత భక్తిపారవశ్యాన్ని నింపుతోందో అర్థం చేసుకోవచ్చు.
కాగా, ఇక్కడి దేవాలయంలో అన్నదానం, పితృకర్మలు కూడా చేస్తుంటారు. అంతే కాకుండా ఇక్కడ హనుమంతుడు పార్వతీ పరమేశ్వరులు, ఆదిత్యుడు, మహావిష్ణువు, దుర్గా, నవగ్రహాలు, స్వర్ణభైరవుని విగ్రహాలు కూడా ఉన్నాయి.