వెస్టిండీస్‌ని ఇటీవల టీ20 సిరీస్‌లో 2-1 తేడాతో ఓడించేసిన భారత్ జట్టు.. వన్డే సిరీస్‌లోనూ అదే తరహాలో కరీబియన్లని చిత్తు చేసి 2-1తో సిరీస్‌ని చేజిక్కించుకుంది. కటక్ వేదికగా ఆదివారం జరిగిన నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో 316 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (85: 81 బంతుల్లో 9x4), ఓపెనర్లు కేఎల్ రాహుల్ (77: 89 బంతుల్లో 8x4, 1x6), రోహిత్ శర్మ (63: 63 బంతుల్లో 8x4, 1x6) నిలకడగా ఆడటంతో మరో 8 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 


భారత్ గడ్డపై గత 13 ఏళ్లుగా ఒక్కసారి కూడా వన్డే సిరీస్‌లో విండీస్ గెలవలేదు, మరియు విండీస్ పై వరుసగా 10 సిరీస్ విజయాలను భారత్ సాధించింది. 316 పరుగుల లక్ష్యఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్.. భారత్‌కి మెరుపు ఆరంభాన్నిచ్చారు. గత బుధవారం వైజాగ్ వన్డేలో సెంచరీలు బాదిన ఈ జోడీ.. కటక్‌లోనూ హాఫ్ సెంచరీలు నమోదు చేసుకుని తొలి వికెట్‌కి 21.2 ఓవర్లలో 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక ఎండ్‌లో క్రీజులో పాతుకుపోయి నిలకడగా ఆడుతున్నా.. శ్రేయాస్ అయ్యర్ (7), రిషబ్ పంత్ (7), కేదార్ జాదవ్ (9) సాహసాలకి వెళ్లి వికెట్ చేజార్చుకున్నారు.

 

అయినప్పటికీ.. ఓపికగా ఆడిన విరాట్ కోహ్లీ.. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన రవీంద్ర జడేజా (32: 25 బంతుల్లో 3x4)తో కలిసి టీమ్‌ని విజయతీరాలకి చేర్చాడు. కానీ.. జట్టు స్కోరు 286 వద్ద కీమో పాల్ బౌలింగ్‌లో కోహ్లీ ఆరో వికెట్ రూపంలో ఔటవడంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. భారత్ విజయానికి 29 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన దశలో కోహ్లీ ఔటవడంతో క్రీజులోకి వచ్చిన శార్ధూల్ ఠాకూర్ (17 నాటౌట్: 6 బంతుల్లో 2x4, 1x6) హిట్టింగ్‌తో అదరగొట్టాడు. 

 

అతనికి తోడుగా రవీంద్ర జడేజా (39 బ్యాటింగ్: 31 బంతుల్లో 4x4) కూడా బ్యాట్ ఝళిపించడంతో భారత్ 48.4 ఓవర్లలోనే 316/6తో అలవోకగా విజయాన్ని అందుకోగలిగింది. ఠాకూర్ హిట్టింగ్ చేయగానే ఒత్తిడికి గురైన వెస్టిండీస్ ఫీల్డింగ్‌లోనూ తప్పిదాలు చేయడం టీమిండియాకి కలిసొచ్చింది. ఆఖరి 8 బంతుల్లో ఒక పరుగు చేయాల్సిన దశలో కీమోపాల్ బౌలింగ్‌లో జడేజా సింగిల్ కోసం ప్రయత్నించగా.. విండీస్ ఫీల్డర్లు ఠాకూర్‌ని రనౌట్‌ని చేశారు. కానీ.. రిప్లైని పరిశీలించిన అంపైర్.. బౌలర్ నోబాల్ విసిరినట్లు తేల్చాడు. దీంతో.. రనౌట్ నిర్ణయం వెలువడక ముందే టీమిండియా గెలిచేసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా విరాట్ కోహ్లీ ఎంపికవగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా రోహిత్ శర్మ ఎంపియ్యారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: