ఆసీస్ తో జరిగిన రెండో టీ20 లో కూడా భారత్ ఓటమిని మూట గట్టుకున్నది. కోహ్లీ , ధోని రాణించిన ... మ్యాక్స్వెల్ రెచ్చిపోవడం తో భారత్ ఓటమి పాలైంది. మ్యాక్స్వెల్ (55 బంతుల్లో 113 నాటౌట్; 7 ఫోర్లు, 9 సిక్సర్లు) దంచికొట్టడంతో.. రెండో టీ20లోనూ భారత్కు ఓటమి తప్పలేదు. సిరీస్ సమం చేయాలంటే కచ్చితంగా గెలువాల్సిన మ్యాచ్లో భారత్ నిరాశపర్చింది. కెప్టెన్ కోహ్లీ (38 బంతుల్లో 72 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (26 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ధోనీ (23 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దుమ్మురేపినా..
ఆసీస్ బ్యాట్స్మన్ మ్యాక్స్వెల్ సెంచరీ జోరు ముందు ఈ త్రయం తేలిపోయింది. ఫలితంగా బుధవారం జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో భారత్పై గెలిచింది. దీంతో రెండు మ్యాచ్ల సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. టీమ్ ఇండియాపై ఇంటా, బయటా ఆసీస్కు ఇదే తొలి టీ20 సిరీస్ కావడం విశేషం. ముందుగా భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులు చేయగా, ఆసీస్ 19.4 ఓవర్లలో 3 వికెట్లకు 194 పరుగులు చేసింది. షార్ట్ (28 బంతుల్లో 40; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు.
మ్యాక్స్వెల్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి. ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్న కోహ్లీ, ధోనీ.. ఆసీస్ బౌలర్లను చితక్కొట్టారు. పరస్పరం బ్యాటింగ్ను ఆస్వాదించుకుంటూ కేవలం 29 బంతుల్లోనే ఫీఫ్టీ భాగస్వామ్యాన్ని చేరారు. తొలి మ్యాచ్లో సరిగా ఆడలేదని విమర్శలు ఎదుర్కొంటున్న మహీ.. షార్ట్ బౌలింగ్లో మిడ్వికెట్ మీదుగా భారీ సిక్సర్తో ఖాతా తెరిచాడు. వేగంగా స్ట్రయిక్ను రొటేట్ చేసిన విరాట్.. 16వ ఓవర్ (కోల్టర్నీల్)లో వరుసగా 6, 6, 6తో 22 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో 29 బంతుల్లో 22వ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 18వ ఓవర్లో ధోనీ.. 6, 6, 4తో 19 పరుగులు రాబట్టడంతో స్కోరు బోర్డు వాయువేగంతో ముందుకెళ్లింది. 19వ ఓవర్లో కోహ్లీ సిక్స్, ఫోర్ బాదినా.. ఆఖరి ఓవర్లో ధోనీ ఔటయ్యాడు. ఈ ఇద్దరి మధ్య నాలుగో వికెట్కు 50 బంతుల్లోనే 100 పరుగులు జతయ్యాయి. తర్వాత కార్తీక్ (8 నాటౌట్) రెండు ఫోర్లు బాదితే.. ఇన్నింగ్స్ ఆఖరి బంతిని కోహ్లీ సూపర్ సిక్స్తో ముగించాడు.