బుల్లితెరపై ఎన్ని షోలు వస్తున్నా జబర్దస్త్ కామెడీ షోకు ఉన్న క్రేజ్ మరే షోకు లేదు. ప్రజల్లో అంతగా పాపులారిటీ సంపాదించుకుంది ఈ ఖతర్నాక్ కామెడీ షో. అందులో నటించడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు కామెడీ షోనే కదా అని చీప్గా తీసి పారేసిన వాళ్లు కూడా వామ్మో జబర్దస్త్ అంటున్నారు. రేటింగ్స్ పరంగా జబర్దస్త్ సృష్టించిన రికార్డులకు తిరుగులేదు. ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఏ షోకు సాధ్యం కాని రికార్డులకు తెరతీసింది. అయితే తనకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన జబర్ధస్త్ కామెడీ షోను నాగబాబు గుడ్ బై చెప్పడంతో మీడియా వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది.
అదే సమయంలో ఈయన జీ తెలుగులో ‘లోకల్ గ్యాంగ్స్’, ‘అదిరింది’ ప్రోగ్రామ్స్కు జడ్జ్గా వ్యవహరిస్తున్నాడు నాగబాబు. మల్లెమాల వాళ్లతో వచ్చిన మనస్పర్ధల కారణంగా నాగబాబు ఈ షోకు గుడ్ బై చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఇక అక్కడ జబర్దస్త్ షోను డైరెక్ట్ చేసిన నితిన్ భరత్ ఇక్కడ కూడా డిజైన్ చేసారు. సేమ్ టూ సేమ్ జబర్దస్త్ కామెడీ షోను దించేసారు జీ తెలుగు. ప్రస్తుతం మెగా బ్రదర్.. ‘అదిరింది’ ప్రోగ్రామ్పైనే దృష్టి సారించారు. అంతేనా.. జబర్దస్త్కు పోటీ ఇచ్చేలా నాగబాబు అనేక విధాలుగా ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్కిట్స్లో కూడా కావాలనే జబర్దస్త్ కామెడీ షోను టార్గెట్ చేస్తున్నాడు నాగబాబు.
మరియు అక్కడి కమెడియన్స్పై, జడ్జిలపై కూడా సెటైర్లు పడేలా చేస్తున్నారు. దీంతో జబర్ధస్త్ మల్లెమాల ప్రొడక్షన్స్ కూడా నాగబాబుకు కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి 9.30 గంటలకు జీ తెలుగులో నాగబాబు అదిరింది షో ప్రసారమయ్యే సమయంలోనే.. ఈటీవీలో జబర్ధస్త్ పాత స్కిట్లను మళ్లీ వేస్తున్నారు. అందులోనూ పంచ్ డైలాగులు ఉండేలా ఎడిట్ చేస్తున్నారు. కనీసం యాడ్స్ కూడా లేకుండా అదిరింది షోపై అటాక్ మొదలు పెట్టారు మల్లెమాల టీం. మరి బుల్లితెరపై ఈ బుల్లిఫైట్ ఎంత వరకు వెళ్తుందో చూడాలి.