గూగుల్ పే యాప్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అల్ఫాబెట్కు చెందిన గూగుల్ పేమెంట్ యాప్ ఇది. ఈ యాప్ సాయంతో డబ్బులను నేరుగా ఇతరుల అకౌంట్లోకి పంపొచ్చు. ప్రస్తుతం ఈ యాప్ను భారత్లో చాలా మంది ఉపయోగిస్తున్నారు కూడా. అయితే గూడుల్ పే వాడుతున్న వారు జర జాగ్రత్త.. మీ బ్యాంకు అకౌంట్లలో నగదు భద్రమేనా? ఓసారి చెక్ చేసుకోండి. సైబర్ మోసగాళ్ల నిఘా మీ అకౌంట్లపై ఉందని మరవద్దు. ఏ క్షణంలోనైనా మీ కన్నుగప్పి నగదు మాయం చేసేస్తారు. ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో గూగుల్ తన గూగుల్ పే కస్టమర్లకు పలు సూచనలు, హెచ్చరికలు జారీ చేసింది.
ముఖ్యంగా గూగుల్ పే యూజర్లను వారి యూపీఐ పిన్ నంబర్ను సీక్రెట్ గా ఉంచుకోవాలని హెచ్చరిస్తోంది. గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్న గూగుల్ పే యాప్ను మాత్రమే డౌన్లోడ్ చేసుకుని వాడాలి. అలాగే ఏదైనా అనుమానాస్పదంగా గుర్తించినా వెంటనే కస్టమర్ కేర్ ను సంప్రదించాలని సూచిస్తోంది. కాల్ సంభాషణలో.. మీ వ్యక్తిగత వివరాలు ప్రభుత్వ ఐడీకార్డు, డాక్యుమెంట్లు, వ్యక్తిగత ఆర్థిక వివరాలు, పిన్, బ్యాంకు అకౌంట్ నెంబర్, యూపీఐ ఐడీలను అడిగితే అసలు ఇవ్వకండి. గూగుల్ పే యాప్లో మనీ రిక్వెస్ట్ వస్తే వెంటనే స్పందించకూడదు. వినియోగదారులకు చెందిన స్నేహితులు, కుటుంబ సభ్యులు, తెలిసిన వారు ముందుగా డబ్బు కావాలని అడిగి.. ఆ తరువాత రిక్వెస్ట్ పంపితే దాన్ని యాక్సెప్ట్ చేయాలి.
అంతేకానీ.. అపరిచితులు మనీ రిక్వెస్ట్ పెడితే దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల వివరాలు చెప్పకపోతే బ్లాక్ అవుతుందని కొందరు బెదిరిస్తారు. అలాంటి వారికీ సమాధానం ఇవ్వకూడదు. అలాగే ఎనీడెస్క్ లేదా టీం వ్యూయర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కొందరు కాల్స్ చేస్తారు. నిజానికి ఈ యాప్లను ఎవరూ ఫోన్లలో వాడకూడదు. ఆ యాప్స్ను ఇన్స్టాల్ చేసుకోమని చెప్పినా స్పందించకూడదు. సైబర్ నేరగాళ్లు, మోసగాళ్లు కేవలం గూగుల్ పే ప్లాట్ ఫాంపై మాత్రమే కాదు.. ఇతర డిజిటల్ ప్లాట్ ఫాంలపై కూడా మోసాలకు పాల్పడుతున్నారు. సో.. బీ కేర్ఫుల్