సాధారణంగా మనం రోజూ ఫ్రిజ్లో అనేక పదార్థాలను నిల్వ ఉంచి ఆ తర్వాత వాడుకుంటూ ఉంటాం. ఇక సమ్మర్లో రిఫ్రిజిరేటర్ ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఎండాకాలంలో చల్లనీళ్ళకోసం ఎంతగా ఫ్రిజ్ పై ఆధారపడతారో అందరికి తెలిసిందే. ఇక ఇంట్లో కూరగాయలను, ఇతర ఆహార పదార్థాలను నిల్వ ఉంచుకోవడానికి, నీళ్లు, ఇతర కూల్ డ్రింకుల వంటివి చల్లబరుచుకోవడానికి, ఐఎస్ క్యూబ్స్ కోసం రిఫ్రిజిరేటర్ ను వినియోగిస్తుంటాం.
ఒకరకంగా చెప్పాలంటే.. ప్రస్తుత వేగవంతమైన జీవితం కారణంగా మన నిత్యావసర వినియోగ వస్తువుల్లో రిఫ్రిజిరేటర్ తప్పనిసరి అవసరంగా మారిపోయింది. కొత్త టెక్నాలజీ.. ఎన్నో ఈజీ టెక్నిక్స్ని మన ముందుకు తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే.. తాజాగా ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం శాంసంగ్ కొత్త రిఫ్రిజిరేటర్ల శ్రేణిని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా దీని స్పెషాలటీ ఏంటంటే.. పాలు..పెరుగుగా మారడంలో కీలకమైన ఫెర్మెంటేషన్ ప్రక్రియను ఆటోమేటిక్గా నిర్వహించే టెక్నాలజీని శాంసంగ్ ఈ ఫ్రిజ్లో అమర్చింది.
అంటే పెరుగు తోడుపెట్టే పని లేకుండా చేసే 'కర్డ్ మేస్ట్రో' ఫ్రిజ్ వీటిలో ఉంది. ఇందుకోసం ఫ్రిజ్లో ప్రత్యేక అర ఉంటుంది. అయిదు నుంచి ఆరు గంటల్లో పెరుగు సిద్ధమవుతుందని సంస్థ వెల్లడించింది. ప్రపంచంలోనే ఈ తరహా మొట్టమొదటి ఫ్రిజ్ ఇదేనని కంపెనీ వెల్లడించింది. ఇక ధర, సామర్ధ్యం విషయానికి వస్తే.. 244 లీ. నుంచి 336 లీ. దాకా సామర్ధ్యముండే కర్డ్ మేస్ట్రో రిఫ్రిజిరేటర్ల ధరల శ్రేణి రూ. 30,990 నుంచి రూ. 45,990 దాకా ఉంటుంది.