ఈ-మెయిల్ నేడు ఎక్కువ మంది వినియోగించే ఆన్ లైన్ సమాచార వారధి. ఎన్నో రకాల సేవలకు ఈ-మెయిల్ ఎంతో అవసరం. అయితే నేటి కాలంలో ఈమెయిల్ అకౌంట్లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు మోసపూరిత డేటాతో కూడిన స్పూఫ్ ఇ-మెయిల్స్ను నెటిజనుల అకౌంట్లకు పంపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతీ ఒక్కరి మెయిల్ ఐడికీ మోసపూరితమైన, స్పామ్ మెయిల్ మెసేజ్ లు భారీ సంఖ్యలో వచ్చి చేరుతుంటాయి. కొత్తగా కంప్యూటర్ ని నేర్చుకుంటూ టెక్నాలజీపై పెద్దగా అవగాహన లేని వారు ఇలాంటి మెయిల్స్ ద్వారా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఉదాహరణకు.. కొందరు మోసగాళ్ళు అధికారిక వెబ్సైట్కు సమానమైన వెబ్సైట్ను క్రియేట్ చేస్తారు.
ఆ తర్వాత ఉద్యోగార్థుల వ్యక్తిగత వివరాలు సేకరించి మోసపూరిత ఈ-మెయిల్స్ పంపిస్తున్నారు. వాటికి రెస్పాండ్ అయిన వారి నుంచి పేపర్ వర్క్, వీసా పేరుతో అందినకాడికి దండుకుంటున్నారు. ఆ తరువాత అటువైపు నుంచి ఎలాంటి సమాచారం ఉండడం లేదు. ఇలాంటి ఈ-మెయిల్స్ నమ్ముకున్న ఎందరో ప్రజలు అన్యాయంగా బలైపోతున్నారు. ఇలాగే కాకుండా అనేక విధాలుగా సైబర్ నేరగాళ్లు మెయిల్స్ పంపిస్తుంటారు. అవి తెలియకుండా క్లీక్ చేస్తే ఎన్నో తిప్పులు పడాల్సి వస్తుంది. అయితే పన్ను రిఫండ్ల పేరిట ఎరవేస్తూ వచ్చే మోసపూరిత ఈ-మెయిళ్ల పట్ల పన్ను చెల్లింపుదారులు అప్రమత్తంగా ఉండాలని ఆదాయపన్ను (ఐటీ) విభాగం తీవ్రంగా హెచ్చరించింది.
‘పన్ను చెల్లింపుదార్లు అప్రమత్తంగా ఉండాలి. పన్ను రిఫండ్లను ఆశచూపుతూ వచ్చే ఎలాంటి నకిలీ లింకులను క్లిక్ చేయవద్దు. అవి మోసపూరిత సందేశాలు. వాటిని మేము పంపడంలేదు’ అని ఐటీ విభాగం ఆదివారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కాగా, గత నెల 8 నుంచి 20 వరకు ఐటీ విభాగం వివిధ రకాల పన్ను చెల్లింపుదారులకు రూ.9 వేల కోట్లకుపైగా రిఫండ్ చేసినట్టు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఇలాంటి నకిలీ లింకుల విషయంలో జాగ్రత్తగా ఉండండి.