నేటి కాలంలో ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లే దర్శనమిస్తున్నాయి. విద్యార్థి నుండి పెద్దల వరకు చేతిలో స్మార్ట్ ఫోన్ వినియోగం తప్పనిసరిగా మారింది. సమాచారమైనా, చేస్తున్న ఉద్యోగం, వ్యాపారం, ఏ పనైనా కావచ్చు.. ఫోను లేకుండా రోజు గడవడం కష్టమే అని చెప్పుకోవాలి. రోజురోజుకు మొబైల్ ఫోన్లు అందులోనూ స్మార్ట్ఫోన్ల సంఖ్య వినియోగం భారీగా పెరిగిపోతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోనూ వీటి వాడకం ఇటీవల ఎక్కువగా కనబడుతుంది. ఖరీదైన ఫోన్లు కొనేందుకు సైతం ఎవరూ వెనుకాడడం లేదు. అయితే స్మార్ట్ఫోన్ వినియోగించే వారు ఎదుర్కొనే ప్రధాన సమస్య త్వరగా బ్యాటరీ త్వరగా అయిపోవడం.
అప్పుడు వచ్చే టెన్షన్ అంతా ఇంతా కాదు. అందుకే బ్యాటరీ ఎక్కువగా ఉండే స్మార్ట్ఫోన్ కొనడం అలవాటు. అయినా బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుంటే ఏదో కోల్పోతున్న ఫీలింగ్ ఉంటుంది. అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే టిప్స్ పాటిస్తే.. మీ బ్యాటరీ లైప్ను సేవ్ చేసుకోవచ్చు. చార్జింగ్ పూర్తిగా అయిపోయేదాక మళ్లీ పెట్టకూడదు అని చాలా మంది నమ్ముతారు. కానీ అది బ్యాటరీ జీవితకాలాన్ని హరించివేస్తుంది. అందుకే బ్యాటరీలో చార్జింగ్ 30-40 శాతం ఉన్నప్పుడే చార్జింగ్ పెట్టాలి. అలాగే మీ ఫోన్లో ఎన్ని యాప్స్ ఉంటే అన్ని నోటిఫికేషన్స్ పంపుతూ ఉంటాయి. వీటిలో చాలావరకు అవసరం లేని నోటిఫికేషన్లే.
మీకు అవసరం ఉన్న నోటిఫికేషన్లు మాత్రమే ఆన్ చేసి, మిగతావి డిసేబుల్ చేస్తే చాలు. బోలెడంత బ్యాటరీ సేవ్ అవుతుంది. అదేవిధంగా, 32 డిగ్రీల ఫారన్ హీట్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద లిథియం-ఇయాన్ బ్యాటరీలు చార్జింగ్ ఎక్కవని ఓ పరిశోధనలో తేల్చారు నిపుణులు. ఎందుకంటే.. తక్కువ ఉష్ణోగ్రత వద్ద చార్జింగ్ పెట్టడం వల్ల యానోడ్ మీద ఉండే లిథియం మీద ప్లేటింగ్ ఏర్పడుతుంది. ఆ ప్లేటింగ్ ను తీసేయడం కూడా కుదరదు. ఇది కూడా మీ బ్యాటరీ జీవితకాలాన్ని తగ్గించేస్తుంది. కాబట్టి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఫోన్ చార్జింగ్ పెట్టడం ఆపేయండి.