ప్రస్తుతం కరోనా వైరస్ ఎంత తీవ్రంగా విస్తరిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య భారీ స్థాయిలో పెరిగిపోతోంది. కరోనా ప్రపంచంపై దాడి మొదలు పెట్టి నెలలు గడుస్తున్నా.. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ రావడం లేదు. అసలు ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి. అయితే కరోనా కారణంగా ఇంట్లో ఉంటున్న ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. దీంతో ఇంటర్నెట్ వినియోగం, కంప్యూటర్ల వినియోగం భారీ స్థాయిలో పెరిగిపోయింది.
అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం తక్కువ బడ్జెట్లో కంప్యూటర్ కొనాలనుకుంటున్న వారికి గుడ్న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే.. గ్లోబల్ పీసీ బ్రాండ్ ఏసర్ తక్కువ ధరకే కంప్యూటర్ను ఆవిష్కరించింది. ఏసర్ వెరిటాన్ ఎన్ సిరీస్ బిజినెస్ పీసీలను రిలీజ్ చేసింది. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవారిని దృష్టిలో పెట్టుకొని ఏసర్ ఈ సరికొత్త పీసీని ఆవిష్కరించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులు మాత్రమే కాకుండా ఆన్లైన్ క్లాసులు వినే విద్యార్థులకు, విద్యా సంస్థలకు, వ్యాపారులకు ఈ పీసీ ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇక దీని ధర కూడా చాలా తక్కువ. 4జీబీ ర్యామ్, ఇంటెల్ డ్యూయల్ కోర్ లేదా క్వాడ్ కోర్ ప్రాసెసర్, మైక్రోసాఫ్ట్ విండోస్ 10 తో పనిచేసే ఈ కంప్యూటర్ ధర కేవలం రూ.9,999 మాత్రమే. అంతేకాకుండా, యూజర్లు ర్యామ్, ప్రాసెసర్ను కూడా పెంచుకోవచ్చు. ప్రొడక్టివిటీ పెంచేందుకు రెండు డిస్ప్లేలను కూడా సపోర్ట్ చేస్తుంది. 6 యూఎస్బీ పోర్టులు ఉంటాయి. వాటిలో రెండు యూఎస్బీ 3.1 జెన్ 1 పోర్టులు ఉంటాయి. వీటి ద్వారా డేటాను హైస్పీడ్తో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కాగా, ఏసర్ ఇండియా వెబ్సైట్తో పాటు ఆఫ్లైన్ స్టోర్లలో కూడా ఏసర్ వెరిటాన్ ఎన్ సిరీస్ పీసీలను కొనుగోలు చేయవచ్చు. ఏదేమైనా ఈ కరోనా కష్టకాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ఇదొక అద్భుతమైన ఆఫర్ అని చెప్పాలి.