ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్).. ఇతర టెలికం సంస్థల నుంచి ఎంత గట్టి పోటీ వచ్చినా.. తన వినియోగదారులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఇక ఇప్పుడు టెలికం సంస్థ మొత్తం డేటా ప్యాక్లపై దృష్టిసారిస్తున్న సమయంలో.. అదిరిపోయే ఆఫర్ను తీసుకొచ్చింది బీఎస్ఎన్ఎల్. ముఖ్యంగా ప్రస్తుతం కరోనా కారణంగా చాలా మంది ఇంట్లో నుంచే వర్క్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగిపోయింది.
ఇలాంటి సమయంలో వర్క్ ఫ్రం హోం ప్రీపెయిడ్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది బీఎస్ఎన్ఎల్. అదే రూ.599 ఎస్టీవీ ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 5 జీబీ డేటాను బీఎస్ఎన్ఎల్ అందించనుంది. ఈ 5 జీబీ డేటా పరిమితి అయిపోయిన నెట్ స్పీడ్ 80 కేబీపీఎస్ కు పడిపోతుంది. ఈ ప్లాన్ ద్వారా వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ లాభాలు కూడా లభించనున్నాయి. ఇక ఈ ప్లాన్ లాభాల విషయానికి వస్తే.. ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది. ఏ నెట్ వర్క్ కైనా కాల్స్ చేసుకోవడానికి 250 ఉచిత నిమిషాలను అందించింది బీఎస్ఎన్ఎల్.
అలాగే రోజుకు 5 జీబీ డేటా వాడుకోవచ్చు. దీనితో పాటు ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ కూడా లభిస్తాయి. ఇక బీఎస్ఎన్ఎల్ దీన్ని వర్క్ ఫ్రం హోం డేటా ప్లాన్ గా ప్రచారం చేస్తుంది. ప్రస్తుతం ఈ ప్లాన్ ముంబై, ఢిల్లీ తప్ప అన్ని సర్కిళ్లలో అందుబాటులో ఉంది. కాగా, గతంలో కూడా రూ.551 ప్లాన్ ద్వారా బీఎస్ఎన్ఎల్ రోజుకు 5 జీబీ డేటాను అందించేది. అయితే ఆ ప్లాన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఏదేమైనా కరోనా రోజురోజుకు తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న వేళ ఈ బీఎస్ఎన్ఎల్ తాజా ప్లాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారాకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది.