కావాల్సిన పదార్థాలు:
కొబ్బరి తురుము- మూడు కప్పులు
యాలకులు- మూడు
నెయ్యి- వంద గ్రాములు
గసగసాలు- వంద గ్రాములు
మైదా- అరకేజీ
బెల్లం- పావుకేజీ
తయారీ విధానం:
ముందుగా కొబ్బరి తురుము, బెల్లాన్ని ఓ ప్యాన్లో వేసి సన్నని సెగపై ఫ్రై చేయాలి. కొబ్బరి, బెల్లం ఉడికి ముద్దలా అయి తీగపాకం వచ్చాక దించాలి. తర్వాత బాగా మెదిపి యాలకుల పొడి, దోరగా వేయించిన గసగసాలు వేయాలి. తర్వాత ఈ కొబ్బరి ముద్దను చిన్న సైజులో ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు మైదాపిండిలో నీళ్లుపోసి చపాతీ పిండిలా కలిపి మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ మైదాను చిన్నచిన్న ఉండలుగా చేసుకుని ఒక్కోదాన్ని చిన్నపూరీలా ఒత్తి, అందులో కొబ్బరి ముద్ద పెట్టి పూరీతో చుట్టేసి చేత్తో లేదా అప్పడాల కర్రతో సున్నితంగా వత్తాలి.
వీటిని బొబ్బట్ల మాదిరిగానే పెనం మీద నెయ్యి లేదా నూనె వేసి రెండువైపులా దోరగా కాల్చాలి. అంతే నోరూరించే కొబ్బరి బొబ్బట్లు రెడీ. వీటిని వేడి వేడిగా కంటే కొద్దిగా చల్లారనిచ్చి తింటే చాలా టేస్టీగా ఉంటాయి. కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది. పచ్చికొబ్బరిలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. కొబ్బరి నీళ్లు, పాలు మంత్ర జలంలా పనిచేస్తాయి. దీనిలో విటమిన్ ఎ, బి, సి, రైబోఫ్లెవిన్, ఐరన్, కాలసియం, ఫాస్పరస్, పిండిపదార్థాలు, కొవ్వు, ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. నిత్యం కొబ్బరి నీళ్లు తాగితే మూత్రపిండాల సమస్యలు దరిచేరవు.
శరీరానికి చల్లదనం లభిస్తుంది. గొంతు మంట, నొప్పిగా ఉన్నప్పుడు కొబ్బరిపాలు తాగితే తగ్గుతుంది. అదే విధంగా కొబ్బరి నూనెలో యాబై శాతం లారిక్ ఆసిడ్ ఉంటుంది. దీన్ని వంటల్లో అధికంగా ఉపయోగిస్తే గుండెకు రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఇన్ని పోషకాలు ఉన్న కొబ్బరితో కొబ్బరితో బొబ్బట్లు చేసుకుంటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం. సో.. తప్పకుండా ట్రై చేయండి.