మూగజీవాల మీద ప్రేమ అంటే సాధారణంగా అందరికీ ఉండదు. చాలా మంది వాటిని దగ్గరకి రానివ్వరు. అందులోనూ అంగవైకల్యం ఉన్నవాటిని అయితే అస్సలే దగ్గరికి రానివ్వరు. కానీ అలాంటి వాటిని కూడా దగ్గరకు చేర్చి పెంచుకుంటుంది ఓ మహిళ. ఢిల్లీకి చెందిన అంజలిగోపాలన్ అనే ఓ మహిళ ఎయిడ్స్ బాధితులను, అనాథ పిల్లలను ఆదరిస్తూ వాళ్ళకు సేవలను అందిస్తూ ఉండేది. ‘నాజ్ షౌండేషన్’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఈ సేవా కార్యక్రమాలన్నిటికీ శ్రీకారం చుట్టింది. ఈ సంస్థ ద్వారా వారి ఆలనా, పాలనా చూస్తుండేది. మానవహక్కులు, జంతు హక్కులను కాపాడడానికి ఆమె ఎన్నోసార్లు ఉద్యమాలు కూడా చేసింది.
ఓ రోజు అంజలీ వెళ్తుండగా రోడ్డపై కాలు విరిగిన కుక్కను చూసింది. దానిని ఎవరూ పట్టించుకోకపోవడంతో తానే వైద్యుని దగ్గరకు తీసుకెళ్లి చికిత్స చేయించింది. అదే సమయం నుంచే అంజలికి మూగజీవాలను కాపాడాలనే ఆలోచన కలిగింది. హర్యానాలోని గ్రామీణ ప్రాంతంలో రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. అందులో జంతువుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. చిన్నప్పటి నుంచి అంజలికి జంతువులంటే అమితమైన ప్రేమ. అంజలి తాను మూగజీవాల కోసం ఏర్పాటు చేసిన కేంద్రానికి ‘ఆల్ క్రియేచర్స్ గ్రేట్ అండ్ స్మాల్(ఏసీజీఎస్)’ అని పేరు పెట్టింది.
జంతువులతోపాటు రోడ్ల పై తిరిగే ఆవులు, కుక్కలు, పక్షులను ఆమె దత్తత తీసుకుని వాటిని సంరక్షిస్తున్నది. ఇప్పటి వరకూ ఆమె నిర్వహిస్తున్న పునరావాసకేంద్రంలో 700లకుపైగా జంతువులున్నాయి. పుట్టుకతో వైకల్యం ఉన్న వాటితోపాటు పలు రకాల వ్యాధుల బారిన పడిన జంతువులు, కాళ్లు, చేతులు విరిగిన మూగజీవాలకు అంజలి సేవలందిస్తున్నది. ఓ అమ్మలాగా అందరినీ ఆదరిస్తుంది. ఇలా ఎంత డబ్బులు ఉంటే మాత్రం ఎంతమంది ఇలాంటి సేవాకార్యక్రమాలను పాల్గొంటున్నారు.