ఏపీలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా చర్యలు తీసుకుంటోంది. కొవిడ్-19 నిర్ధారణ పరీక్షల్లో మరింత వేగం పెంచేందుకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టింది. ఈ మేరకు బుధవారం వెయ్య టెస్టింగ్ కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కిట్లను విశాఖపట్నంలో తయారుచేస్తున్నారు. మరికొద్దిరోజుల్లోనే మొత్తం పదివేల కిట్లను అందుబాటులోకి తెచ్చేందుకు సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారు. ఒక్క కిట్తో 20 నిర్ధారణ పరీక్షలు చేయొచ్చునని, అదికూడా అతితక్కువ సమయంలో ఫలితం వెలువడే అవకాశం ఉందని అధికారలు చెబుతున్నారు. నిజంగా స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం టెస్టింగ్ కిట్లను తయారు చేయించి, అందుబాటులోకి తీసుకురావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా చికిత్స కోసం అనేక ఆస్పత్రులను సిద్ధం చేశారు. అవసరమైన వైద్యసిబ్బందిని కూడా నియమించారు.
పూర్తిస్థాయిలో టెస్టింగ్కిట్లు అందుబాటులోకి వస్తే.. నిర్ధారణ పరీక్షలను వేగంగా చేపట్టవచ్చునని, దీంతో బాధితులకు సకాలంలో వేగంగా చికిత్సలు అందించే అవకాశం ఉంటుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి.. స్వయంగా టెస్టింగ్ కిట్లను తయారు చేయించడం ఒక సాహసమేనని, దేశానికి ముఖ్యమంత్రి జగన్ ఆదర్శంగా నిలుస్తున్నారని మెచ్చుకుంటున్నారు. ఇప్పటికే కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఏపీలో తాజాగా మరో 15 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో బుధవారం ఉదయం నాటికి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య మొత్తం 329కు చేరింది. కొత్తగా నమోదైన 15కేసుల్లో నెల్లూరులో 6, కృష్ణాలో 6, చిత్తూరు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. కరోనా భారిన పడి ఇప్పటి వరకు నలుగురు మృతి చెందగా, ఆరుగురు డిశ్చార్జ్ అయినట్లు అధికారవర్గాలు తెలిపాయి.