కరోనా కాలంలో రిలయన్స్ జియో సరికొత్త యాప్తో వినియోగదారుల ముందుకు వచ్చింది. వారికి మరో సరికొత్త అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థతి. ఈ కష్టకాలంలో ఉన్న జియో వినియోగదారులు ఇతరులకు రీచార్జ్ చేయడం ద్వారా కమిషన్ పొందేలా జియోపోస్ లైట్ పేరుతో ఒక యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా జియో వినియోగదారులు తమకు తెలిసిన ఇతర జియో కస్టమర్లకు ప్రీపెయిడ్ రీచార్జీలను చేయొచ్చు. ఇలా చేసిన ప్రతి రీఛార్జ్ ద్వారా 4.16శాతం కమీషన్ సంపాదించవచ్చునని పేర్కొంది. ఇక ఈ యాప్ను అన్ని యాప్ల్లానే గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా చాలా సులభంగా ఉండడం గమనార్హం. పైగా ఎలాంటి పత్రాలు కూడా సమర్పించాల్సిన పని లేదు.
నిజానికి.. ఇప్పటికే మైజియో యాప్, జియో వెబ్సైట్ ను ఉపయోగించి ఇతర జియో కస్టమర్లకు రీచార్జ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఆ రీచార్జ్ లపై కమిషన్ వినియోగదారులకు రాదు. తాజా యాప్ ద్వారా వినియోగదారులు కమీషన్ పొందవచ్చు. అంతేకాదు ఇందులో పాస్ బుక్ ఫీచర్ కూడా ఉంటుంది. దీని ద్వారా వినియోగదారులు గత 20 రోజుల్లో నిర్వహించిన లావాదేవీలు, వచ్చిన కమీషన్ ను చెక్ చేసుకోవచ్చు. ఇక రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవడం అని ఆలోచిస్తున్నారా..? అదికూడా సులభమే.. జియోపోస్ లైట్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకొని... జియో నంబరును నమోదు చేయాలి. ఇలా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత వాలెట్ లో రూ .500, రూ .1000, రూ .2000 లాంటి ఆప్షన్లతో డబ్బును వేయమని యాప్ అడుగుతుంది. అలాగే రీచార్జ్ ప్రణాళికలను చూపుతుంది. దీన్ని ఎంచుకొని రీచార్జ్ చేసినప్పుడు 4.16 శాతం కమీషన్ పొందవచ్చు. అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే ఈ సదుపాయం ఉంది. ప్రస్తుతం ఐఓఎస్ వెర్షన్ కు మాత్రం ఈ సదుపాయం లేదు.