ఇండియాలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ విస్తరిస్తోంది. ఈశాన్య భారతంలోనూ క్రమంగా తన ప్రతాపం చూపుతోంది. తాజాగా.. నాగాలాండ్ రాష్ట్రంలోనూ మొదటి కేసు నమోదు అయింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సదరు వ్యక్తిని వెంటనే గౌహతిలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ తర్వాత ఆస్పత్రి పరిసరాలతోపాటు కోహిమాలోని పలు ప్రాంతాలను ప్రభుత్వం సీల్ చేసింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, సామాజిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
లాక్డౌన్ నిబంధనలను పాటించాలని, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నిజానికి.. గత నాలుగు రోజుల్లో కరోనా వైరస్ దేశంలోని 80కిపైగా కొత్త జిల్లాల్లోకి వ్యాపించింది. ఇదిలా ఉండగా.. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 9,205 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరణించిన వారి సంఖ్య 331కు చేరుకుంది. ఇక సుమారు 764మంది కరోనా నుంచి కోలుకున్నారు. అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.