ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న, తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి జగన్ ఆదివారం మధ్యాహ్నం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రధానంగా ఏపీలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అమలు చేయాల్సిన కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా.. ఈ నెల 20వ తేదీ తర్వాత ఏపీలో లాక్డౌన్ అమలులో సడలింపులు ఇవ్వాలా..? వద్దా..? అన్న అంశాలపై కూడా అధికారుల అభిప్రాయాలను సీఎం జగన్ తెలుసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో లాక్డౌన్ సడలింపులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది అందరిలో ఉత్కంఠను రేపుతోంది.
కాగా, ఏపీలో కొత్తగా మరో 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 647కి చేరింది. గడిచిన 24 గంటల్లో జరిగిన కరోనా నిర్దారణ పరీక్షల్లో కర్నూలు జిల్లాలో 26, కృష్ణా జిల్లాలో 6, తూర్పుగోదావరి జిల్లాలో 5, అనంతపురం జిల్లాలో 3, గుంటూరులో 3, విశాఖపట్నం 1 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 65 మంది డిశ్చార్జ్ కాగా, 17 మంది మరణించారు. ప్రస్తుతం 565 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 158 కేసులు నమోదయ్యాయి.