ప్రాణాలకు తెగించి కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది కూడా వైరస్ బారిన పడుతున్నారు. ఈ సంఖ్య రోజుకరోజుకు ఎక్కువ అవుతోంది. ఇప్పటివరకు ఒక్క ముంబైలోనే 250మంది హెల్త్ వర్కర్లకు వైరస్ సోకడంతో వైద్యవర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ రోజు బాంబే ఆస్పత్రిలో ఏడుగురు వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. అలాగే.. భాటియా ఆస్పత్రిలో పది మంది సిబ్బంది కరోనా వైరస్బారినపడ్డారు. దీంతో ఈ ఆస్పత్రిలో కరోనా బారినపడిన వైద్యసిబ్బంది సంఖ్య ఏకంగా 45కు చేరుకుంది. వైరస్ బారిన పడిన వారిలో డాక్టర్లు, నర్సులు. ఇతర సిబ్బంది ఉన్నారు. ఇక ఢిల్లీలో, మధ్యప్రదేశ్తోపాటు తదితర రాష్ట్రాల్లో కూడా పలువురు వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకింది.
ఈ నేపథ్యంలో వైద్యవర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా బారిన పడిన వైద్య సిబ్బంది కుటుంబాలు కూడా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చెన్నైతోపాటు పలు రాష్ట్రాల్లో స్ట్రైక్ చేయడానికి కూడా పూనుకోవడం కలకలం రేపుతోంది. రక్షణ చర్యలు లేకపోవడం వల్లే వైద్య సిబ్బంది కరోనా బారిన పడుతున్నారని, అవసరమైన పీపీఈ కిట్లను అందించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.