కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోయారు. పొట్టచేతబట్టుకుని బతుకుదెరువు కోసం పట్టణాలకు వచ్చిన వలస కూలీలు, కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది. చేసేందుకు పనులు లేక తినేందుకు తిండిలేక ఆకలితో అలమటిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇదే క్రమంలో సొంతూళ్లకు కాలినడకక వందల కిలోమీటర్లు ప్రయాణించిన కూలీలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే.. అధికారులు ఎక్కడికక్కడ కూలీలను, కార్మికులను అడ్డుకుంటున్నా.. వారి ప్రయాణం మాత్రం ఆగడం లేదు.
తాజాగా.. విజయవాడ నుంచి ఆగ్రాకు పలువురు కూలీలు సైకిల్పై బయలుదేరారు. ఆగ్రా నుంచి వచ్చిన వలస కూలీలు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో రోజువారీ పనులు చేసుకుని బతుకుతున్నారు. లాక్ డౌన్ వల్ల పనులు లేకపోవడంతో చేతిలో ఉన్న డబ్బులు అయిపోవడంతో తమ సొంతూరు వెళ్లిపోవడానికి నిశ్చయించుకున్నారు. కొంతమంది యువకులు కూలీలు సైకిల్పై విజయవాడ నుంచి ఆగ్రాకు బయలుదేరారు.