భారతదేశంలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా నిన్న సాయంత్రం 5గంటల నుంచి అంటే గత 24 గంటల్లో 1,975 కొత్త కరోనావైరస్ కేసులు, 47 మరణాలు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు ఒక్కరోజులో ఇంత భారీ సంఖ్య కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 26,917 కు చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం మరణాల సంఖ్య 826కు చేరుకుంది. దేశంలోని కరోనావైరస్ రోగుల రికవరీ రేటు 22 శాతానికి పెరిగిందని, 10 రోజుల క్రితం వరకు నమోదైన 12 శాతం రేటు నుండి 10 శాతం పాయింట్లు పెరిగాయని ప్రభుత్వ అధికారులు చెప్పారు.
ఒక రోజులో 704 మంది కరోనావైరస్ నుండి కోలుకున్నారు. ఈ రోజు వరకు మొత్తం 6,25,309 నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తెలిపింది. అయితే.. మే 3వ తేదీన లాక్డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం మరోసారి ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.