మహారాష్ట్రలో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. దేశంలోనే అత్యధిక పాజిటివ్ కేసులు, మరణాలు ఇక్కడే నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 8వేలకు చేరుకుంది. ఇక 342 మంది మరణించారు. ఇందులో దేశ వాణిజ్యరాజధాని ముంబైలోనే ఎక్కువ కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయి. ఇక దేశ వ్యాప్తంగా కూడా రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా నిన్న సాయంత్రం 5గంటల నుంచి అంటే గత 24 గంటల్లో 1,975 కొత్త కరోనావైరస్ కేసులు, 47 మరణాలు నమోదు అయ్యాయి. ఒక్కరోజులో ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
దీంతో మొత్తం కేసుల సంఖ్య 26,917 కు చేరుకుంది. మొత్తం మరణాల సంఖ్య 826కు చేరుకుంది. దేశంలోని కరోనావైరస్ రోగుల రికవరీ రేటు 22 శాతానికి పెరిగిందని, 10 రోజుల క్రితం వరకు నమోదైన 12 శాతం రేటు నుండి 10 శాతం పాయింట్లు పెరిగాయని ప్రభుత్వ అధికారులు చెప్పారు. ఈ రోజు వరకు మొత్తం 6,25,309 నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తెలిపింది. అయితే.. మే 3వ తేదీన లాక్డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం మరోసారి ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.