కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రజాప్రతినిధులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో వారు కూడా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఏపీ రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన సతీమణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీకి సోమవారం విజయనగరంలోని వారి నివాసంలో వైద్యులు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అలాగే విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్కి కూడా వైద్యులు కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అయితే వీరి ముగ్గురికి కరోనా నెగటివ్గా అని రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కరోనా వైరస్ నిర్ధారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కిట్లతో కేవలం పదినిమిషాల్లోనే ఫలితం వస్తుంది.
ఇదిలా ఉండగా.. విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అయితే పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లాలో కూడా మొన్నటివరకు ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. కానీ..గత రెండుమూడు రోజులుగా పరిస్థితి మారిపోయింది. ఆ జిల్లాలోకి వైరస్ వ్యాప్తి చెందింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణపై విజయనగరంలో టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. జిల్లాలో కరోనాను అడ్డుకునేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా కృషిచేస్తున్నారని తెలిపారు. వైరస్ జిల్లాలోకి చొరబడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.