తెలంగాణలో కరోనా కాస్త తగ్గుముఖం పడుతోంది. పలు జిల్లాలు క్రమంగా కోలుకుంటున్నాయి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా కరోనా కలకలం రేపింది కరీంనగర్లోనే. ఇప్పుడు ఈ జిల్లా కరోనా రహితంగా మారుతోంది. కరోనా బాధితులు దాదాపుగా కోలుకున్నారు. జిల్లాకు చెందిన 19 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, ఇప్పటికే 17 మంది విడతలవారీగా డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు తాజాగా ఇంటికి చేరుకున్నారు. ఈ నెల 2 నుంచి హైదరాబాద్లోని కింగ్ కోటిలో చికిత్స పొందుతున్న జిల్లాకు చెందిన వ్యక్తి 24 రోజుల తర్వాత కోలుకుని సోమవారం డిశ్చార్జ్ అయినట్లు డీఎంఅండ్హెచ్వో జీ సుజాత తెలిపారు.
మర్కజ్కు వెళ్లి వచ్చిన ఇతడికి చికిత్స తర్వాత కరోనా నెగెటివ్ వచ్చినప్పటికీ హోం క్వారంటైన్లో ఉంచుతామని ఆమె వెల్లడించారు, ప్రతి రోజూ వైద్య సిబ్బంది ఇతడి ఆరోగ్యాన్ని పరీక్షిస్తారని ఆమె తెలిపారు. కాగా, కరోనా సోకిన ఇంకా ఒక్కరు మాత్రమే హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారని ఆమె వివరించారు. ఈ ఒక్కరు కూడా కోలుకుంటే.. ఇక కరీంనగర్ జిల్లా కరోనా రహితంగా మారుతుందని అధికారవర్గాలు అంటున్నాయి.