కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఏపీ సర్కార్ మరో ముందడుగు వేసింది. ఇప్పటికే దేశంలోనే అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తూ మొదటి స్థానంలో ఉన్న ఏపీ వైరస్ ఇన్ఫెక్షన్ రేటు నియంత్రణ, పాజిటివ్ కేసుల తగ్గుదల శాతంలోనూ మెరుగైన స్థానంలో ఉంది. తాజాగా రాష్ట్రంలో నిర్ధారణ పరీక్షల సంఖ్య చూస్తే రోజురోజుకూ వైరస్ ఇన్ఫెక్షన్ రేటు తగ్గుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సోమవారం నాటి గణాంకాల ప్రకారం ఏపీలో 74,551 టెస్టులు చేయగా.. 1,177 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కల ప్రకారం ఇన్ఫెక్షన్ రేటు కేవలం 1.58 శాతం మాత్రమే ఉన్నట్టు తేలింది. ఇదే సమయంలో దేశంలో సగటు ఇన్ఫెక్షన్ రేటు 4.20 శాతంగా నమోదు కావడం గమనార్హం. దేశంలో ఇప్పటి వరకూ 6,65,819 టెస్టులు చేయగా 27,964 పాజిటివ్ కేసులు తేలాయి.
కాగా, సోమవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో ఏపీలో 6517 టెస్టులు చేశారు. మొత్తం 80 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో పాజిటివ్ కేసుల శాతం 1.22 శాతంగా నమోదైంది. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. 86 శాతం కేసులు మూడు జిల్లాల్లోనే సోమవారం నమోదైన కేసులు కూడా రెడ్జోన్లలోనే నమోదయ్యాయి. మొత్తం 80 కేసుల్లో గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల్లోనే 69 కేసులున్నాయి. అంతేగాకుండా.. ఏపీలో 20 శాతం రికవరీ రేటు నమోదైంది. మృతుల రేటు 3.8 నుంచి 2.83కు తగ్గింది. సగటున పది లక్షల జనాభాకు 1396 మందికి టెస్టులు చేస్తున్నారు. దేశంలో పది లక్షల జనాభాకు 480 టెస్టులు జరుగుతున్నాయి.