అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజూ నమోదు అయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య తగ్గిపోతోంది. గత 24 గంటల్లో అమెరికాలో 1300మంది మరణించారు. గత రోజులతో పోల్చుకుంటే చాలా తక్కువనే చెప్పొచ్చు. ఒక్కరోజే మూడు వేలు, నాలుగు వేలు, ఆ పై కూడా మరణాలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరణాల సంఖ్య బాగా తగ్గిపోవడం కరోనా తగ్గుముఖం పడుతుందనడానికి సంకేతమని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి.. ప్రపంచంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదు అవుతోంది అమెరికాలోనే.
ఇప్పవరకు అమెరికాలో 59వేలకు పైగా మంది మరణించారు. ఇక పాజిటివ్ కేసుల సంఖ్య 1,035,765పైగా చేరుకుంది. ప్రధానంగా న్యూయార్క్, న్యూజెర్సీలోనే అత్యధిక కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. అయితే.. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో లాక్డౌన్ ఆంక్షలను ఎత్తివేస్తున్నారు. కానీ.. న్యూయార్క్లో మాత్రం ఆంక్షలు యథావిధిగా కొనసాగుతాయని అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 3,136,508 మందికి కరోనా సోకగా.. 217,813 మంది మరణించారు.